శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:54 IST)

2019లో భీమవరం నుంచి కేటీఆర్ పోటీ చేయడం ఖాయమేనన్నమాట...

తెలుగు రాష్ట్ర సమితిగా వస్తుందట... తెరాస. తెదేపా, వైకాపాకు గట్టి పోటీయేమో?

గ్రేటర్ ఎన్నికలు ఇచ్చిన కిక్కు తెరాసకు మామూలు ఉత్సాహం కాదు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2019 ఎన్నికల్లో పాగా వేయాలన్నంత ఉత్సాహం తన్నుకొచ్చేస్తున్నట్లు కనబడుతోంది. తెలంగాణ ఐటీ శాఖామంత్రి, కేసీఆర్ తనయుడు ఏదో సెటైరికల్‌గా అప్పట్లో వేసిన జోక్ నిజరూపం దాల్చుతుందేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. వివరాల్లోకి వెళ్దాం. గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఓ విలేకరి... సీమాంధ్రులు కూడా మీకు ఓట్లు వేసి ఘన విజయం చేకూర్చారు. భవిష్యత్తులో మీరన్నట్లుగానే తెలుగు రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చుతారా అని అడిగితే... నవ్వేసిన కేటీఆర్, 'అవును నిజమే! అక్కడ కూడా ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు, తెలుగు రాష్ట్ర సమితిగా మార్చాలేమో' అంటూ చమత్కరిస్తూ మాట్లాడారు. తాము తెలుగు రాష్ట్రాలు రెండూ సుఖంగా ఉండాలని కోరుకుంటామనీ, కాకపోతే తెలంగాణ విషయంలో అది ఓ పిసరు ఎక్కువుంటుందని చెప్పుకొచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తాము ఎన్నడూ బాధపెట్టలేదని, అధికారంలోకి వచ్చాక కూడా హుదూద్ తుఫాను బీభత్సం సమయంలో విశాఖకు, అమరావతికి, శ్రీశైలం నీరు విడుదల సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రజలకు అండగా ఉందని గుర్తు చేశారు. కాబట్టి 2019లో భీమవరం నుంచి కేటీఆర్ పోటీ చేయడం ఖాయమేనన్నమాట.