శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (10:01 IST)

'ఖబడ్దార్ కేసీఆర్' బ్యాలెట్ పేపర్లపై కేసీఆర్‌కు హెచ్చరికలు!

తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉపయోగించిన బ్యాలెట్ పత్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వార్నింగ్ ఇస్తూ రాతలు రాశారు. ‘ఖబడ్దార్ కేసీఆర్. నియంతలా వ్యవహరిస్తున్నావు. తీరు మార్చుకోవాలి. ఇదే పద్ధతి కొనసాగితే, నీ అంతు చూస్తాం’ అని ఆ స్లిప్పుల్లో రాశారు. 
 
ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో పాటు తమ వ్యాఖ్యలు రాసిన స్లిప్‌లను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. కొందరు స్లిప్‌లతో పనిలేకుండా, బ్యాలెట్ పత్రం వెనుక భాగంపైనే ఈ వ్యాఖ్యలు రాశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సదరు స్లిప్‌లను చూసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. సదరు స్లిప్‌లను తొలుత టీఆర్ఎస్ నేతలకు చూపించిన అధికారులు, విపక్షాల అభ్యంతరంతో వాటిని చించేసి చెత్తబుట్టలో పడేశారట.
 
గతంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండి ఉండివుంటుంది. జైల్లోని హీరోను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ తమ సాక్ష్యాన్ని ఓటర్లు తమ ఓటుతో పాటు బ్యాలెట్ బాక్సుల్లో వేస్తారు. ఎన్నికల్లో హీరో గెలవడమే కాక, జైలు నుంచి నిర్దోషిగానూ విడుదల అవుతాడు. అలాంటి సంఘటనో టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పునరావృత్తం కావడంతో తెరాస నేతలు షాక్‌కు గురయ్యారు.