శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:29 IST)

కాశ్మీర్‌పై కామెంట్స్ చేసే సీన్ ఎంపీ కవితకు ఉందా?

కాశ్మీర్ అంశంపై కామెంట్స్ చేసే సీన్ నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవితకు ఉందా అనే చర్చ సాగుతోంది. ఇటీవల లోక్‌సభలో ఆమె కాశ్మీర్ విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెల్సిందే. దేశంలోని కొన్ని భాగాలు భారత్‌కు చెందినవి కావని, దీన్ని మనం అంగీకరించాలని కవిత కాశ్మీర్‌ను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. 
 
స్వాతంత్రానికి పూర్వం జమ్ము-కాశ్మీర్, హైదరాబాద్ ప్రత్యేక దేశాలని, భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్‌లను బలవంతంగా భారతదేశంలో కలిపారంటూ ఆమె విమర్శలు చేశారు. జమ్ముకాశ్మీర్‌తో పాటు తెలంగాణలో భూచట్టాలు ఒకేలాగా ఉన్నాయని ఇరుప్రాంతాల్లో స్థానికులు తప్ప ప్రాంతేతరులు భూములు కొనడం నిషిద్ధమన్నారు. 
 
జమ్ముకాశ్మీర్‌పై భారతదేశానికి స్పష్టత రావాలని అవసరమైతే భారత్ అంతర్జాతీయ సరిహద్దుల్ని మార్చుకోవాలని అంటూ కాశ్మీర్‌ను భారత్ వదులుకోవాలన్న అర్థంలో కవిత మాట్లాడారు. ఈ వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవిత చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతపైనా, సమాఖ్య చట్టబద్ధతపైనా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.