గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: మంగళవారం, 29 జులై 2014 (13:12 IST)

నిధుల్లేక అల్లాడుతోన్న తెలంగాణా పంచాయితీలు

పంచాయితీ ఎన్నికలు జరిగి ఏడాది కావొస్తున్నా సకాలంలో నిధులు అందకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలపై ప్రభుత్వ వివక్ష చూపిస్తోంది. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలన్న గాంధీజీ మాటల్ని కనీసం లేశమాత్రమైనా ఆచరణలోకి తీసుకోవడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
 
91 పంచాయితీల్లో ఏకగ్రీవంగా సర్పంచుల ఎన్నిక 
ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడే పంచాయితీలు గడువు ముగిసినప్పటికీ సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. పంచాయితీ సెక్రటరీల పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయి. పంచాయతీ ఎన్నికల్లో 91 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలన ప్రారంభమై ఏడాది కావస్తోన్నా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు చెల్లించాల్సిన నిధులను మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు.
 
మైనర్‌ పంచాయితీలకు 5, మేజర్‌ పంచాయితీలకు ఏడున్నర లక్షలు 
గత ప్రభుత్వాలు ఏకగ్రీవంగా ఎన్నికైన మైనర్‌ పంచాయితీలకు 5 లక్షలు, మేజర్‌ పంచాయితీలకు ఏడున్నర లక్షలు చెల్లించాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయితీలకు ఎంత చెల్లిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు. 
 
ఒక్కో పంచాయితీకి స్థాయినిబట్టి 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు వచ్చాయి. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులతో పాటు ఏకగ్రీవ పంచాయతీలకు విడుదల చేసే ప్రత్యేక ప్యాకేజి నిధులను కూడా విడుదల చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. కొత్త రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం పంచాయితీల అభివృద్ధికి నిధులు పెంచాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.