శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (10:54 IST)

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను రాత్రికిరాత్రే భూస్థాపితం చేస్తాం : మహేందర్ రెడ్డి

టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు తలచుకుంటే హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను రాత్రికిరాత్రే భూస్థాపితం చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయంలో తెరాస శ్రేణులు దాడి చేసి తగులబెట్టిన విషయం తెల్సిందే. 
 
దీనిపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. తాము తలుచుకుంటే తెలంగాణ భవన్ ఇటుక కూడా మిగలదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'టీడీపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ భవన్ గేటు కాడికి రండి. చూసుకుందాం' అంటూ సవాల్ విసిరారు. 
 
తమను రెచ్చగొడితే రాత్రికి రాత్రే హైదరాబాద్ టీడీపీ కార్యాలయాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంతుచూసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.