గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (16:23 IST)

ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరికి చేదు గుళికలు... రేణుక నుంచి రక్షించండి బాబోయ్...

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ సమావేశం రచ్చరచ్చ అయింది. కాంగ్రెస్ జాతీయ నేత కుంతియాతోపాటు రాష్ట్ర నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌ అలీ ఏర్పాటు చేసిన సమావేశంలో రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెడ్డ రోజులు పోయి మంచిరోజులు రావాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్లను పార్టీ నుంచి సాగనంపాలంటూ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి.
 
వైరా అసెంబ్లీ సీటు ఇప్పిస్తానంటూ రేణుకాచౌదరి తన భర్త నుంచి రూ.కోటి పది లక్షలు తీసుకున్నారంటూ కె.కళావతి తన అనుచరులతో కలిసి ఆందోళన నిర్వహించారు. తనకు న్యాయం చేయాలంటూ ఖమ్మంకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాకు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు గిరిజనులతో కలిసి కళావతి ర్యాలీ నిర్వహించారు. రేణుకా చౌదరి చీటర్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
 
'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి నా భర్త నుంచి రేణుకా చౌదరి రూ.కోటి 10 లక్షలు తీసుకున్నారు. అయినా టిక్కెట్ ఇప్పించలేదు. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుండా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడు' డాక్టర్ రాంజీ భార్య కళావతి ఆరోపించారు. ఇదే విషయంపై గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదన్నారు. 
 
కాగా, మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘రేణుకా హటావో కాంగ్రెస్ బచావో' అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.