గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (07:58 IST)

మీరేంటి బహిష్కరించేది.. పదవి వెంట్రుకతో సమానం.. కేసీఆర్‌కు కొండా షాక్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండువారాలే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు.. ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొంత పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. తెరాసలో పార్టీ బ్రష్టుపట్టిపోయిందనీ, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదంటూ మండిపడ్డారు. పైగా, అది పార్టీ కాదనీ, ఓ పార్టీ కుటుంబం అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తెరాసతో పాటు.. కేసీఆర్‌కు నాలుగు పేజీల లేఖను రాశారు. 
 
చేవెళ్ల లోక్‌సభ సభ్యుడుగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి రాసిన లేఖలో... రాజీనామాకు గల కారణాలను వివరించారు. గత నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోయినందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
2013లో తనను కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేసిన కొండా... కేసీఆర్ చాలా సార్లు తమ ఇంటికి వచ్చారని.. చేవెళ్ల నుంచి తనను లోక్‌సభకు పోటీ చేయమన్నారని చెప్పారు.
 
చేవెళ్లలో అర్బన్ పాపులేషన్ ఎక్కువని.. ఓడిపోయే సీటుగా తనను భావించారని.. అయితే రాత్రిపగలు శ్రమించి అనూహ్యంగా ఎంపీగా గెలిచానన్నారు. కేసీఆర్ విజన్‌తో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని భావించానని.. తన సామర్థ్యం మేరకు అభివృద్ధికి కృషి చేశానన్నారు. 
 
నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి వెళ్లానని.. నాలుగున్నరేళ్లలో 90 సార్లు లోక్‌సభలో మాట్లాడానన్నారు. రెండేళ్లుగా పార్టీ ప్రజలకు దూరమైందన్న ఆయన.. ప్రభుత్వం ప్రజల వద్దకు చేరుకోలేకపోయిందన్నారు. వ్యక్తిగతంగా అనేకసార్లు నిరాశకు గురయ్యానని.. కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్నారు. 
 
ముఖ్యంగా, పార్టీలో తనకు అధికారం లేకుండా పోయిందన్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వారికి ఏమాత్రం గౌరవ మర్యాదలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని పార్టీలోకి ఆహ్వానించి మంత్రిపదవులు కట్టబెట్టారనీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరోపించారు. 
 
ఏ అంశంపై చర్యలు చేపట్టలేకపోయానని తెలిపిన కొండా.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా మాత్రమే సరైన మార్గం అనిపించిందన్నారు. అందుకే పార్టీకి, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. 
 
పైగా, కొండాను పార్టీలో కొనసాగేలా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా, తనపై బహిష్కరణ వేటు వేసేందుకు కేసీఆర్ నిర్ణయించారని సమాచారం తెలుసుకున్న కొండా.. ఏకంగా తన లోక్‌సభ స్థానానికే రాజీనామా చేసి తెరాస అధినేతకే షాకిచ్చారు.