గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (14:44 IST)

తెరాసతో పొత్తు లేదు.. టీడీపీతో పెట్టుకుంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

స్థానిక సంస్థల కోటా కింద జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. అదేసమయంలో రంగారెడ్డి వంటి చోట్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షం స్థానంలో ఉన్న తాము ఏ విధంగానైనా అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలని, ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని వీలైనంతమంది తమ ప్రతినిధులను చట్టసభలోకి పంపించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందులోభాగంగా స్థానిక సంస్థల కోటాలో వీలైనన్ని ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. జిల్లాల వారిగా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాను ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ఈ జాబితాను ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు అందిస్తారు. ఆ వెంటనే అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ దిగ్విజయ్‌తో కసరత్తు మొదలుపెడుతుంది. 
 
ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ బలబలాలను, ఆశావాహుల జాబితాను పీసీసీకి తొమ్మిది జిల్లాల డీసీసీ అధ్యక్షులు సమర్పించగా రంగారెడ్డి జిల్లాలో టీడీపీతో కాంగ్రెస్ సయోద్య కుదుర్చుకుంది. అక్కడ చేరో సీటులో పోటీ చేయాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరును నేతలు ఖరారు చేశారు. 
 
ఇక ఖమ్మంలో అటు వామపక్షాలు, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇక్కడ నుంచి సీపీఐ తరుపున పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.