బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (14:31 IST)

దిగ్విజయ్ వంటివారే పార్టీని నాశనం చేశాడు : టీ ఎంపీ వీహెచ్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వంటి నేతలే కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేశారంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే క్రమంలోనే టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
 
ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు చేస్తున్న ధర్నాకు పొన్నాల వెళ్లడమేంటని నిలదీశారు. ఉద్యమమే చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీనే చేయవచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయ కమిటీ బాధ్యతలు ఏమిటో కూడా అర్థం కావడం లేదని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతల వ్యవహారశైలితో టీడీపీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదిరిందేమో అన్న సందేహం కార్యకర్తల్లో నెలకొందనే అనుమానం వ్యక్తం చేశారు.
 
ఇదేసమయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కూడా వీహెచ్ ఉతికి ఆరేశారు. డిగ్గీలాంటి నేతలు ఢిల్లీ నుంచి వచ్చి పార్టీని చెడగొట్టారని మండిపడ్డారు. దిగ్విజయ్ కేవలం సమస్యలు వింటారే తప్ప... పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోరని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారి వల్ల పార్టీ సర్వనాశనమై పోయిందన్నారు. ఏపీలో పూర్తిగా భూస్థాపితమై పోయిందని ఆయన గుర్తు చేశారు.