గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (12:10 IST)

రామోజీరావుకు పద్మవిభూషణ్ బిరుదు ఎలా ఇస్తారు: ఉండవల్లి ప్రశ్న

ఎన్నో ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై పద్మ విభూషణ్ బిరుదు ఎలా ఇస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రామోజీరావుకు అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని ఉండవల్లి తప్పుబట్టారు. ఆయనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 
 
తనపై ఉన్న కేసుల నుంచి రామోజీరావు బయటపడలేదని, ఎందరో ప్రజల నుంచి ఆయన డబ్బు వసూలు చేశారని అరుణ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఈ విషయాలను ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. గతంలో తాను రామోజీరావు బాగోతాలను బయటపెట్టినప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా విచారణకు ఆదేశించారని, ఇప్పుడు ఆ విచారణ పూర్తి కాకుండానే అవార్డు ప్రకటించేశారని అంటూ, విచారణ జరిపించాలని కోరుతూ జైట్లీ రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు.