బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (13:47 IST)

వరంగల్ ఫలితాలు: రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది.. పార్టీ మారుతారా?

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లిపోయినట్టేనని వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు తేల్చిన నేపథ్యంలో.. ఇంకా మునిగే పడవలో ఉండటం ఎందుకని రేవంత్ రెడ్డి అనుచరులు కొందరంటున్నారని.. తద్వారా రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి జంప్ అవుదామా అంటూ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్ అంటేనే తీవ్రస్థాయిలో మండిపడిన రేవంత్ రెడ్డి ఆ పార్టీలోకి జంప్ అయ్యేందుకు అవకాశాల్లేకపోవడంతో తెలంగాణలో తమ పార్టీతో పాటు తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. 
 
వరంగల్ ఉపఎన్నికల్లో గులాబీ దండు దుమ్మురేపింది. ఎన్నికల రేసులో వెనక వస్తున్న వారిపై ముఖాలపై కారు రేపిన దుమ్ము బెత్తెడు మందాన పేరుకుపోయింది. కనీసం ప్రధాన పార్టీలకు సైతం డిపాజిట్లు దక్కలేదు. ప్రత్యేకించి టీడీపీ విషయానికి వస్తే.. బీజేపీతో కలసి జట్టుకట్టి బరిలో దిగినా కనీసం సెకండ్ ప్లేస్ కూడా దక్కలేదు. చివరకు టీడీపీ ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు.
 
ఈ ఉపఎన్నికల ఫలితం టీడీపీ నేతలను ఆలోచనలో పడేసింది. ప్రధానంగా కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే రేవంత్ రెడ్డికి ఈ ఫలితాలు ఒకరకంగా మైండ్ బ్లాక్ చేశాయి. కేసీఆర్‌ను బండబూతులు తిట్టడంతోనే తానూ ఆ స్థాయి లీడర్‌నని భ్రమిస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఓ అపవాదు ఉంది. పసుపు మీడియా అండదండలు పుష్కలంగానే ఉన్నా.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో దాని ప్రభావం ఏమీ కనిపించడం లేదు. దీంతో ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.