శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (14:28 IST)

భార్యను వివస్త్రను చేసి.. వీధుల్లో తిప్పుతూ.. కర్రతో కొడుతూ.. ఓ భర్త కిరాతక చర్య!

నిజామాబాద్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అంతం చేసేందుకు అతికిరాతకంగా ప్రవర్తించాడు. పూటుగా మద్యం సేవించిన అతను.. భార్యను కత్తితో బెదిరిస్తూ వివస్త్రను చేసి.. వీధుల్లో తిప్పుతూ.. కర్రతో చావబాబుతూ... పరుగు పెట్టించాడు. ఆ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు ఆ అభాగ్యురాలు నీటి కాల్వలో దూకినప్పటికీ.. ఆ మృగాడు వదలిపెట్టలేదు. ఆమెను వెంటాడుతూ చెరువులోకి దూకి.. జుట్టు పట్టుకుని గట్టుపైకి ఈడ్చుకొచ్చిమరీ కొట్టాడు. ఈ దారుణం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ కిరాతక చర్య వివరాలను పరిశీలిస్తే.. 
 
నిజామాబాద్‌కు చెందిన కవిత, నర్సింహులు భార్యాభర్తలు. వివాహమైనప్పటి నుంచి నర్సింహులుకి భార్యపై అనుమానం జబ్బు ఉంది. దీనికితోడు నర్సింహులు ఓ దొంగ. నిత్యం తాగివచ్చి ఆమెను వేధించేవాడు. మద్యం కోసం తాను దొంగిలించిన వస్తువులను అమ్ముకుని రావాలంటూ ఆమెను వేధించసాగాడు. పైపెచ్చు.. మరో మహిళను వివాహం చేసుకుని ఇంట్లోనే ఉంచుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం తాగి వచ్చి భార్యను వివస్త్రను చేశాడు. కత్తితో దాడి చేశాడు. దీంతో అతని నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆమె కాలనీలోకి పరుగులు తీసింది. అయినప్పటికీ కీచక భర్త వదిలిపెట్టక పోవడంతో పక్కనే ఉన్న నీటి కాల్వలో దూకేసింది. 
 
అప్పటికీ.. వదిలిపెట్టని అతను ఆమెను కాల్వలో నుంచి జుట్టుపట్టుకుని బయటకు లాక్కొచ్చి చితకబాదడాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించి, కీచక భర్త నుంచి ఆ మహిళను కాపాడారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని నర్సింహులును అరెస్టు చేసి జైలుకు తరలించారు. 
 
కాగా, కవిత కాల్వలో దూకడంతో తలకు బలమైన గాయం తగిలింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు కవితకు అండగా నిలిచాయి. నర్సింహలును కఠినంగా శిక్షించాలంటూ ఆ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.