శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (15:54 IST)

కొత్త కోడలి హత్య చేసేందుకు యత్నం.. భర్త... అత్త అరెస్టు!

తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో కొత్త కోడలిని హత్య చేసేందుకు భర్త, అత్తలు యత్నించి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన దారుణ వివరాలను పరిశీలిస్తే.. కరీంనగర్‌కు చెందిన హనుమాన్, మధురవాణి దంపతుల కుమార్తె అరుణ (22)ను రెజిమెంటల్‌ బజార్‌కు చెందిన జి.చంద్రశేఖర్ (26) అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. ఈయన ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌‌గా కొనసాగుతున్నారు. వీరికి గత ఆగస్టు 15వ తేదీన వివాహమైంది. చంద్రశేఖర్ తండ్రి కొద్దికాలం క్రితమే మృతి చెందడంతో, తల్లి, భార్యతో కలిసి తాతాచారి కాలనీలో వీరంతా కలిసి ఉంటున్నాడు. అయితే, వివాహ సందర్భంగా అరుణ తల్లిదండ్రులు లక్ష రూపాయలతో పాటు కొంత బంగారాన్ని కట్నకానుకలుగా సమర్పించుకున్నారు. 
 
అయితే, వివాహమైన రెండు నెలల వరకు బాగానే ఉన్న చంద్రశేఖర్ ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని చూపించాడు. నిత్యం మద్యం సేవించి వచ్చి భార్యను ఏదో ఒక వంకతో వేధిస్తూ, చితక బాదసాగాడు. అలాగే, అదనపు కట్నం కోసం ఆ నవ వధువు అత్త కూడా వేధిస్తూ వచ్చింది. గత రాత్రి ఇంటికి వచ్చిన చంద్రశేఖర్ భార్యపై వేధింపులకు దిగాడు. అతనికి అత్త తోడవ్వడంతో గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు.
 
అనంతరం గదిలో నిర్బంధించి కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రాణ భయంతో భీతిల్లిన అరుణ బాత్రూంలోకి పరుగెత్తింది. వెళ్తూనే భర్త సెల్ తీసుకెళ్లింది. దాంతో పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో వారు గోపాల్ పురం పోలీసులను అప్రమత్తం చేసి, బాత్రూంలో దాక్కున్న అరుణను కాపాడారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ భర్త చంద్రశేఖర్, అత్త లక్ష్మిలను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.