గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (06:48 IST)

చేనేత కార్మికుల కన్నీళ్లు తుడిచే తెలంగాణకు కేసీఆర్ ప్రతిజ్ఞ

నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం పోవాలని, వారి తలరాతలు మారాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. వారి సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్లోనే అందుకు నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు.

నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం పోవాలని, వారి తలరాతలు మారాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. వారి సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్లోనే అందుకు నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతీ కుటుంబం గౌరవంతో బతికే వేతనం పొందాలన్నది సంకల్పం. ఈ వృత్తిపై జీవించే పద్మశాలీల సంక్షేమానికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తాం. చేనేత మగ్గాలపై పనిచేసే వారున్నారు.. మరమగ్గాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారున్నారు.. వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నవారున్నారు.. వీరందరి కోసం త్రిముఖ వ్యూహంతో చర్యలు చేపడతాం..’’అని తెలిపారు. చేనేత మగ్గాలు, మర మగ్గాల కార్మికులందరూ మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానం రూపొందిస్తామని  ప్రకటించారు. 
 
నేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారమిక్కడ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ రవీందర్‌ రావు, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌ లూమ్‌ పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వీరందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న సీఎం త్రిముఖ వ్యూహంతో నేత కార్మికులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి మగ్గాన్ని లెక్కించి చేనేతపై ఆధారపడిన వారిని గుర్తించాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘నారాయణపేట, గద్వాల, పోచంపల్లిలో కళాత్మక వస్త్రాలు తయారు చేసే వారున్నారు. అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న ఆ వస్త్రాలను తయారీ చేసే వారిని ప్రోత్సహించే విధానం రూపొందించాలి. చేనేత మగ్గాలపై సాధారణ వస్త్రాలు నేసే వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలి. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించాలి. వారు తయారు చేసే వస్త్రాలన్నింటినీ ప్రభుత్వం తరఫునే కొనుగోలు చేయాలి. మార్కెటింగ్‌ సమస్యలు రాకుండా చూడాలి’’అని అన్నారు.
 
తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి రెండుసార్లు కళ్లవెంట నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘కరీంనగర్‌ ఎంపీగా ఉన్పప్పుడు ఓ రోజు పేపర్లో సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికుల మృతి అనే వార్త వచ్చింది. అది చూడగానే మనసు చలించింది. ఏడ్చినంత పనైంది. తిండికి లేక కార్మికులు మరణించడం బాధనిపించింది. సిరిసిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడమేంటి.. అని ఆలోచించాను. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు.
 
అప్పుడు నేనే పూనుకొని టీఆర్‌ఎస్‌ తరఫున రూ.50 లక్షలు సిరిసిల్లకు పంపా. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకుంది. మరో సందర్భంలో పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించారనే వార్త చూసిన. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. నేనే స్వయంగా భిక్షాటన చేసిన. రూ.4 లక్షలు జమచేసి వారికి అందజేసిన. ఈ బాధ తెలంగాణలో కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం’’అని ముఖ్యమంత్రి అన్నారు.
 
‘‘రాష్ట్రంలో పవర్‌లూమ్‌లు సిరిసిల్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రేపియర్‌ మగ్గాల స్థాయికి పవర్‌లూమ్‌లను ఆధునీకరించాలి. ఇప్పుడున్న మరమగ్గాలతో రోజుకు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్‌ మగ్గాల ద్వారా 150 మీటర్లకుపైగా తయారవుతుంది. దీంతో యజమానులకు లాభాలొస్తాయి. ఈ ఫలితం కార్మికులకు దక్కాలి. కార్మికులకు ప్రతి నెలా రూ. 15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి. రూ.15 వేల నుంచి రూ. 20 వేల ఆదాయం తప్పక రావాలి’’అని సీఎం చెప్పారు.