మద్యం మత్తులో కారు నడిపి.. పలువురుని గుద్దిన యువతి!
హైదరాబాద్లో పబ్ కల్చర్ శృతిమించిపోతోంది. ఈ పబ్లకు వెళ్లే యువతులు, మహిళలు పీకల్లోతు వరకు మద్యం సేవించడమే కాకుండా, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నగర రోడ్లపై మద్యం సేవించిన ఓ మహిళ కొద్దిసేపు అలజడి సృష్టించింది.
మద్యం నిషా నషాళానికెక్కడంతో హైదరాబాద్ రోడ్లపై హల్ చల్ చేసింది. ఆ యువతి చేతిలోని కారు పలువురిని గుద్దుకుంటూ ముందుకెళ్లింది. అయినా ఆ మహిళ కారును ఆపకుండానే ముందుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు కొద్దిపాటి శ్రమతో కారును నిలిపేసి యువతిని కటకటాల వెనక్కి పంపించారు. ఈమె వద్ద జరిపిన విచారణలో... ఆ యువతిని షహనాజ్గా తేలింది. ఆమెకు ఇదేమీ కొత్త కాదని, గతంలోనూ పలుమార్లు ఇదే రీతిన మద్యం మత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిందని తేలింది.
సోమవారం రాత్రి ర్యాష్ డ్రైవింగ్లో షహనాజ్, ఇద్దరిని గాయపరిచింది. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్పై వలపన్నిన పోలీసులు ఎట్టకేలకు షహనాజ్ ర్యాష్ డ్రైవింగ్కు బ్రేకులేశారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి, సోదాలు చేయగా, షహనాజ్ కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో పోలీసులు కంగుతిన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఆమె చేసిన ప్రమాదాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు.