టిక్కెట్ అడిగితే రైల్వే మహిళా టీసీని చిత్తుగా కొట్టారు!
హైదరాబాద్, బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా రైల్వే టీసీపై ఎనిమిది మంది దుండగులు దాడి చేశారు. ఇంతకీ ఈ మహిళా టీసీ చేసిన నేరం.. వారిని టిక్కెట్ అడగడమే. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది.
బేగంపేట ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో టి కౌసల్య అనే మహిళా టీసీ తన విధులను నిర్వహిస్తుంది. ఆ సమయంలో పలువురు యువకులను టిక్కెట్లు చూపించమని అడిగింది. అంతే ఒక్కసారి ఎనిమిది మంది దండగులు ఆమెను చితకబాది, అక్కడ నుంచి పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
నిజానికి ఇటీవల కాలంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్ళలో టీసీలపై దాడులు ఎక్కువయ్యాయి. మొన్నటికిమొన్న ఓ మహిళా టీసీని రైల్లోంచి కిందికినెట్టివేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా, గురువారం ఓ ఎంఎంటీఎస్ రైలులో టికెట్ అడిగిన టీసీ కౌసల్యపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. దీనిపై బేగంపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.