బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (13:47 IST)

తెలంగాణలో వైకాపా పరామర్శ యాత్ర... షర్మిల 8 నుంచి టూర్

తెలంగాణలో వైకాపాను బలోపేతం చేయడానికి ఆ పార్టీ నడుం బిగించి కదులుతోంది. తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల డిసెంబర్ 8 నుంచి తన పరామర్శ యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రను ఈ జిల్లాలో నాలుగు లేదా ఐదు రోజుల పాటు కొనసాగిస్తారని సమాచారం. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన 16 కుటుంబాల వారిని షర్మిల పరామర్శిస్తారు.
 
పాలమూరు జిల్లాలో యాత్ర పూర్తి అయిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఆమె పరామర్శ యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 
 
గతంలో ఓదార్పు యాత్ర పేరిట జగన్ చేపట్టిన ఈ యాత్ర ఖమ్మం జిల్లా తర్వాత ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తదుపరి యాత్రను షర్మిళ చేపడతారని ఆ పార్టీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.