ప్రజలు నన్ను యాక్టర్గా చూడడం లేదు : అమీర్ ఖాన్
తాను చేసిన పాపులర్ టివి షో 'సత్యమేవ జయతే' తర్వాత తన సినిమాలకు ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయిందని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వాపోతున్నాడు. 'సత్యమేవ జయతే' తర్వాత ప్రజలు నన్ను యాక్టర్గా చూడడం లేదు, నన్నొక బాధ్యత కలిగిన వ్యక్తిగా చూస్తున్నారు అని ఓ కార్యక్రమంలో పాల్గొన్నపుడు వ్యాఖ్యానించారు.
తాజాగా అమీర్ 'సత్యమేవ జయతే-3' టివిషోని ప్రారంభించారు. మూడో భాగం చిత్రీకరణ కోసం ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అందుకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. సమాజంలో మార్పు తేవడమే లక్ష్యంగా వివిధ సామాజిక అంశాలతో ఈ షో సాగుతుంది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఈ 'సత్యమేవ జయతే' మూడో సీజన్ ప్రసారమవుతుంది.
అమీర్ ఇంకా మాట్లాడుతూ రాజస్థాన్లో 'పీకే' సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రిపోర్టర్లందరూ సినిమా గురించి కాకుండా 'సత్యమేవ జయతే' టివి షో గురించే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు అని తెలిపారు. పీకే సినిమా గురించి మాట్లాడుతూ గత పాతిక సంవత్సరాలుగా ప్రేక్షకులు నా సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ 'పికె' సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక నగ్నంగా ఉన్న పోస్టర్ గురించి నేను పట్టించుకోవడం లేదని తెలిపారు.