ఎర్రచందన స్మగ్లింగ్ కేసులో నటి నీతూ అగర్వాల్ అరెస్టు!
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ సినీ నటి, ‘ప్రేమ ప్రయాణం’ హీరోయిన్ నీతూ అగర్వాల్ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రాష్ట్రాల్లో పోలీసులు ఆమె కోసం వేట సాగించగా, హైదరాబాదులోనే ఆమె ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు. ఆ తర్వాత రాత్రికిరాత్రే ఆమెను కర్నూలుకు తరలించారు.
ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత మస్తాన్ వలిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి స్మగ్లర్లకు పెద్ద ఎత్తున డబ్బు సరఫరా అయినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న కర్నూలు జిల్లా పోలీసులు రుద్రవరం పోలీస్ స్టేషన్లో నీతూపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.
అయితే, కేసు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు మహారాష్ట్ర (ముంబై), కర్ణాటక (బెంగుళూరు), తెలంగాణ (హైదరాబాద్) రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించారు. చివకు హైదరాబాద్లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు.