అక్కకోసం తమ్ముడి బాధ... అదే ఆమె ఎవరు?
అనుకోకుండా తన అక్క చనిపోతే తమ్ముడు పడే బాధ ఎలా వుంటుందనే కాన్సెప్ట్తో హార్రర్ కామెడీ చిత్రం రూపొందుతోంది. దీనికి 'ఆమె ఎవరు!' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం ప్రారంభమైంది. తమ్ముడిగా ధన్రాజ్ నటిస్తుండగా అక్కపాత్ర కోసం ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నామని చిత్ర దర్శకుడు రమేష్ తెలియజేస్తున్నారు. ఎనిమిదేళ్ళుగా ప్రముఖుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో తొలిసారిగా దర్శకుడినయ్యాననీ, మూడు షెడ్యూళ్లలో చిత్రాన్ని పూర్తిచేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అనిల్ కళ్యాణ్, మిత్రపై ముహూర్తపుషాట్ను తీశారు. దీనికి నటుడు చలపతిరావు క్లాప్ కొట్టగా, చిత్ర నిర్మాత పైల సత్యనారాయణ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవీప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనాటి ట్రెండ్కు తగిన కథ అనీ, భారతిరామారావు, కుమార్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని వీరగణేష్ కర్రి తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా తమకు మంచి గుర్తింపు వస్తుందని హీరోహీరోయిన్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: శానాపతి, సంగీతం: చిన్నికృష్ణ, మాటలు: ఆర్. ఫణీంద్ర, ప్రసాద్.