శివాజీ ఇంటిని పుణ్యక్షేత్రంగా భావిస్తున్నా: అమితాబ్ బచ్చన్
కల్యాణ్ జ్యుయెల్లరీ షాపు ఓపెనింగ్ సెర్మనీ తమిళనాడులోని చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ఏప్రిల్ 17న చెన్నై వెళ్లారు. అప్పుడప్పుడూ సినిమా షూటింగులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడికే వెళ్లే ఆయన ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రధాన కారణం నాటితరం లెజండరీ నటుడు శివాజీ గణేశన్ ఇంటిని సందర్శించడమే! అంతేకాదు, తమిళులు తనపై చూపిన అభిమానానికి బిగ్ బీ ముగ్దుడైపోయారట.
"సినిమాల కోసం గత 40 ఏళ్లుగా నేను చెన్నై వస్తూనే ఉన్నా. శివాజీ గారు నటించిన ఓ తమిళ చిత్రానికి రీమేక్గా రూపొందించే హిందీ సినిమా షూటింగ్ కోసం డబ్బయవ దశకంలో మొదటిసారి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి నేను శివాజీ సర్కు గొప్ప అభిమానిని" అని బిగ్ బి తెలిపారు. ఈ క్రమంలో ఈసారి టీ నగర్లోని శివాజీ గణేశన్ ఇంటిని కూడా అమితాబ్ సందర్శించారు. అంతేకాదు, ఆయన కుమారుడు, నటుడు ప్రభు, ఆయన కుటుంబ సభ్యులతో కలసి విందు కూడా చేశారు.
అందుకుగానూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపిన బిగ్ బి, "గతంలో ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కానీ ఈరోజు ఈ ఇంటిని సందర్శించడం నాకు గౌరవంగా ఉంది. దీనిని నేను ఓ పుణ్యక్షేత్రంలా భావిస్తున్నా" అని పేర్కొన్నారు. అభిమానులందరికీ అమితాబ్ ధన్యవాదాలు తెలిపారు.