వర్మ అరెస్టు... బాహుబలి లీకేజీ కేసును ఛేదించిన పోలీసులు!
బాహుబలి లీకేజీ కేసును సీసీఎస్ పోలీసులు ఛేదించారు. టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన లీకేజీ సూత్రధారి అయిన వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన గతంలో మకుట విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్ కావడం గమనార్హం.
పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వర్మ బాహుబలి సినిమాలోని కొన్ని దృశ్యాలను ల్యాప్టాప్లోకి కాపీ చేశాడు.
ఆ తర్వాత వాటిని వాట్స్యాప్, ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్కు షేర్ చేశాడు. అక్కడి నుంచి నెట్లో అది హల్ చల్ చేసింది. మొత్తం 13 నిమిషాల నిడివి కలిగిన కీలక సన్నివేశాలను వర్మ కాపీ చేసి, ముందుగానే లీక్ చేసినట్లు తెలియడంతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.