శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (13:43 IST)

మంచు విష్ణు - మంచు లక్ష్మీ ప్రసన్నలది ఒకే కుటుంబం కాదా : బెల్లంకొండ సురేష్

మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఒకే కుటుంబ సభ్యులు కారా అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియా మిత్రులను ప్రశ్నించారు. గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం కాకపోవడంతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదని వివరణ ఇచ్చారు. ఆ డబ్బులను మంచు లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాల్సిందిగా మంచు విష్ణుకు చెబితే ఆయన సరేనన్నారు. కానీ, మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతనికి తనకు లింకు పెట్టొద్దనీ, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయమని బెల్లంకొండ ప్రశ్నించారు. 
 
కాగా, "ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా" చిత్రం కోసం వేసిన సెట్‌ను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన రభస చిత్రం కోసం నిర్మాత బెల్లంకొండ సురేష్ వాడుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు అద్దె ఇస్తామని లక్ష్మీతో బెల్లంకొండం ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, రభస చిత్రం ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. దీంతో మంచు లక్ష్మీ ప్రసన్న కొంతమంది అనుచరులను మంగళవారం రాత్రి బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపించి తన డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేయించిన విషయం తెల్సిందే. ఇది టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. 
 
ఈ నేపథ్యంలో బెల్లంకొండ బుధవారం మీడియాతో మాట్లాడుతూ మంచు లక్ష్మికి రూ.58 లక్షలు ఇవ్వాల్సిన మాట నిజమేనన్నారు. అయితే, మంచు విష్ణు తనకు ఇవ్వాల్సిన రూ.60 లక్షలు ఆమెను తీసుకోవాల్సిందిగా తాను చెప్పానని, ఇదే విషయంపై మంచు విష్ణుతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. కానీ, లక్ష్మీప్రసన్న మాత్రం అతనికి తనకు సంబంధంమేంటని ప్రశ్నిస్తోందన్నారు. వీరిద్దరు ఒకే కుటుంబ సభ్యులు కారా అని తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, మంచు లక్ష్మీప్రసన్న ఆమె తండ్రి మోహన్‌బాబుకు తెలియకుండానే ఇదంతా చేస్తున్నట్టుగా ఉన్నారని బెల్లంకొండ సురేష్ సందేహం వ్యక్తం చేశారు.