శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (18:03 IST)

రంభ కేసు: కేసులో నటి బ్రదర్ పూర్తి క్లారిఫికేషన్!

సినీ నటి రంభ కుటుంబం సభ్యులతోపాటు.. ఆమె తల్లిదండ్రులపై రంభ సోదరుని భార్య, వరుసకు మరదలైన పల్లవి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పెట్టిన గృహహింస కేసు వివాదాస్పదంగా మారడమే కాకుండా, తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు నేపథ్యంలో రంభ సోదరుడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి కేసుకు సంబంధించి పూర్తి వివవారలను వెల్లడించారు. 
 
తన భార్య పల్లవి మా కుటుంబపై తప్పుడు కేసు పెట్టిందని, ఆమె చెన్నైలోని మా ఇంట్లో ఉన్న వజ్రాల నగలు, మా ఇద్దరు పిల్లలను తీసుకుని హైదరాబాద్‌లోని పుట్టింటికి గత ఫిబ్రవరి రెండో తేదీన వచ్చేసిందని, ఈ విషయంపై మా నాన్న చెన్నై పోలీసులకు ఒక ఫిర్యాదు రూపంలో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు. 
 
అపుడు తాను టొరంటోలో ఉన్నట్టు చెప్పారు. నా భార్య ఆస్తితో, పిల్లతో పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలిసి తాను చెన్నైకు తిరిగి రాగానే.. తనపై వచ్చిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే మా మీద ఈ గృహహింస కేసు పెట్టిందని చెప్పుకొచ్చారు. మా ఇద్దరికి వివాహమై 15 యేళ్లు అయిందన్నారు. ఇద్దరు పిల్లలున్నారు. ఇన్నాళ్ళుగా లేని వేధింపులు ఆమెకు నేను దేశంలో లేనప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో, ఇంట్లోంచి నగలు తీసుకుని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కావడం లేదన్నారు. 
 
ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని విచారించిన కోర్టు.. నన్ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. 1999లో వివాహమైన సమయానికి పల్లవి కుటుంబం అద్దె ఇంట్లో ఉండేదని, వారికి ఇపుడు ఒక బంగ్లా, మూడు ఫ్లాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. 
 
పల్లవి కుటుంబం మాకు ఏ రూపంలో కట్నం ఇచ్చారో.. మేం కట్నం కోసం ఎప్పుడు వేధించామో ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ఉద్దేశించిన 498ఎ సెక్షన్‌ని దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు. ప్రచారం కోసమే పల్లవి ఈ కేసులో నా సోదరి రంభని ఇరికించారని, ఈ కేసుతో రంభకి ఎలాంటి సంబంధం లేదని, ఆమెపై దుష్ప్రచారం చేయవద్దని శ్రీనివాస్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు.