గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 14 జూన్ 2014 (18:19 IST)

నందమూరి తారకరత్న 'కాకతీయుడు'

నందమూరి తారకరత్న, శిల్పా, యామిని నటీనటులుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కాకతీయుడు'. ఎల్‌.వి.ఆర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై లగడపాటి వెంకాయమ్మ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి శనివారం చిత్ర బృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
 
దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ... కాకతీయుడు సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. వినుకొండ, గుంటూరు ప్రాంతాల్లో చిత్రీకరించాం. తారకరత్న సరసన ఇద్దరు తెలుగమ్మాయిలు నటించారు. వినోద్‌కుమార్‌ విలన్‌గా కనిపిస్తారు. ఎస్‌.ఆర్‌ శంకర్‌ చక్కని పాటలిచ్చారు అని తెలిపారు. 
 
హీరో తారకరత్న మాట్లాడుతూ... నిర్మాత పదేళ్ళగా నాకు మిత్రుడు. ఫస్ట్‌ సినిమా నాతోనే చేస్తానని మాటిచ్చాడు. అలాగే చేస్తున్నాడు. సముద్రతో చేస్తున్న రెండో సినిమా ఇది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనరిది. ఒకటో నంబర్‌ కుర్రాడు సినిమా తరహాలో చక్కని పాటలు కుదిరాయి. హీరోయిన్‌లకు మొదటి సినిమా అయినా బాగా యాక్ట్‌ చేశారు అని అన్నారు. 
 
నిర్మాత మాట్లాడుతూ... 30 రోజుల్లో 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నెల 25 నుండి నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఉంటుంది. దాంతో సినిమా పూర్తవుతుంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేసి, ఆగస్ట్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం అని అన్నారు. 
 
ఇందులో స్నేహితుల మధ్య మంచి ఎపిసోడ్స్‌ ఉన్నాయి. అలాగే చక్కని సందేశం కూడా ఉందని మాటల రచయిత మల్కార్‌ శ్రీనివాస్‌ తెలిపారు. చండీ తరువాత సముద్రతో చేస్తున్న రెండో చిత్రమిదని సంగీత దర్శకుడు ఎస్‌.ఆర్‌ శంకర్‌ తెలిపారు. సినిమాలో అవకాశం పట్ల యామిని, శిల్పారెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు.