అమల క్రౌడ్ ఫండింగ్ చేయమన్నారు....
''సినిమా నిర్మాణానికి అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. ప్రముఖ నటులను కలిశాం. ఎవ్వరూ ఈ పాత్ర చేయలేమని చెప్పారు. ఆఖరికి మలయాళ నటుడు సిద్ధిక్ ముందుకువచ్చారు. ఆయన కుమార్తెగా అంజలి పాటిల్ చేసింది. వీరిద్దరే సినిమాకు ప్రాణం పోశారు. ఈ సినిమా పూర్తయ్యాక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందింది. కానీ ప్రజలకు చూపించాలంటే మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. తర్వాత తెలిసిందేమంటే.. నిర్మాణం కంటే విడుదల చేయడం చాలా కష్టం.
విడుదలకు చాలామందిని కలిసినా వీలుకాలేదు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా చూసి ఎంతో మెచ్చుకున్నారు. కానీ విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి టైమ్లో అక్కినేని అమలగారి సలహా ఎంతో స్పూర్తిని రగిల్చింది. శాటిలైట్ హక్కుల అమ్మకంలో చాలా సపోర్ట్ చేయడమేకాకుండా క్రౌడ్ ఫండింగ్ చేయమన్నారు. దాంతో ఫేస్బుక్ ద్వారా అప్రోజ్ అయితే ఎంతోమంది సహృదయలు ముందుకు వచ్చారు.
రిలయన్స్ సంస్థ కూడా విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. విడుదలకు 15 లక్షలు ఖర్చవుతుందని చెబితే, క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందుకు రెట్టింపే రావడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ వుంది. మొట్టమొదటిసారిగా ఇలా తెలుగు సినిమా విడుదల కావడం ఇండస్ట్రీలో ఓ చరిత్రని'' డా. సునీతాకృష్ణన్ తెలిపారు.
ఆమె నిర్మించిన చిత్రం 'మా బంగారుతల్లి'. ఈ చిత్రం గత ఏడాది రూపొందింది. మూడు జాతీయ పురస్కారాలు, ఐదు అంతర్జాతీయ అవార్డులూ పొందింది. ఈ చిత్రాన్ని ఇటీవలే చిరంజీవి చూసి మెచ్చుకుంటూ... ఏదో ఆర్ట్ ఫిలిం అని భ్రమించాను. ఇది కమర్షియల్ సినిమా అని చెబుతూ... ఈ చిత్రానికి బ్రాండ్ అంబాసిడర్గా వుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం 100 థియేటర్లలో ఈనెల 21న ఆంధ్ర, తెలంగాణ, చెన్నై, బెంగుళూరు, ముంబై, యు.ఎస్.లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం విడుదలకు క్రౌండ్ ఫండింగ్ ద్వారా బెంగుళూరుకుచెందిన ఒకే ఒక వ్యక్తి 12 లక్షలు నిర్మాతకు అందజేయడం విశేషం.
చిత్ర దర్శకుడు రాజేష్టచ్వర్ మాట్లాడుతూ... ఇది యదార్థసంఘటన. ఎంతోమంది వ్యభిచారకూపంలో చిక్కుకుంటే నిర్మాతే రక్షించారు. ఇటువంటి చిత్రాన్ని తెరపై చూపించాలంటే ఎక్కడా అసభ్యత వుండకూడదు. అలాంటి నిబంధనతో స్క్రిప్ట్ను రాయాల్సివచ్చింది. అనుభవాలు చూపకుండా ఫీలింగ్స్తోనే చూపించే ప్రయత్నం చేశాం. ఇటువంటి చిత్రం ప్రతి ఒక్కరూ చూడాలని' చెప్పారు.