గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (18:07 IST)

పవన్ కళ్యాణ్ ఓటు.. మెగా ఫ్యామిలీ మద్దతున్న రాజేంద్ర ప్రసాద్‌కేనా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. దీంతో ఇపుడు అగ్రహీరోలు తమ ఓటు ఎవరికి వేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. ఈయన మెగా హీరోలు పూర్తి మద్దతు తెలుపుతున్న రాజేంద్‌ప్రసాద్‌కు వేస్తారా లేక సహజనటి జయసుధకు వేస్తారా అనేది అర్థం కావడం లేదు. 
 
ఈనెల 29వ తేదీన మా అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ ఎవరి గెలుపు ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మెగా ఫ్యామిలీ రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ.... పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేస్తారు? అనేది హాట్ టాపిక్ అయింది. 
 
అయితే కొందరు ఆయన ఓటింగుకు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం 700కి పైగా సభ్యులు ఉన్న మావీ ఆర్టిస్టస్ అసోసియేషన్‌లో దాదాపు 350 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమలోని నటులు రెండు వర్గాలుగా చీలి పోయారు. 
 
కొందరు ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ఇస్తుండగా, మరికొందరు జయసుధకు మద్దతు ఇస్తున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు ఇటు జయసుధ వర్గం, అటు రాజేంద్ర ప్రసాద్ వర్గం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఈ ఎన్నికల విషయం హాట్ టాపిక్ అయింది. జయసుధ ప్యానెల్‌ను..... వెనుక నుంచి దాసరి వర్గం నడిపిస్తుందని, రాజేంద్రప్రసాద్ ప్యానెల్‌ని వెనక నుండి చిరంజీవి వర్గం నడిపిస్తుందనే ఊహాగానాలు ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.