అమితాబ్ షూటింగ్ స్పాట్ సమీపంలో గ్యాంగ్ వార్... కాల్పుల్లో ఒకరు మృతి
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ స్పాట్కు సమీపంలో గ్యాంగ్ వార్ జరిగింది. ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో సెక్యురిటీ కాంట్రాక్టర్ రాజు షిండే గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ప్రాంతానికి రెండు బైకులపై వచ్చిన దుండగులు రాజుపై అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.
దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రాజు షిండే పొట్టలో దిగబడింది. అనంతరం ఆ దుండగులు అక్కడికి నుంచి పరారైయ్యారు. దీన్ని గమనించిన సమీపస్తులు రాజును హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దుండగులు ఒక బైకును సంఘటనా స్థలంలో వదిలేసి వెళ్లినట్టు తెలిపారు.
ఈ విషయం తెలుసుకుని అమితాబ్ చిత్ర యూనిట్ అంతా ఆందోళన చెందారట. తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి 20 అడుగుల దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగిందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.