శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:12 IST)

నరేంద్ర మోడీని కలిసిన మంచు ఫ్యామిలీ.. రాజకీయాలపై మనోజ్ కామెంట్స్!

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టాలీవుడ్ నటుడు డాక్టర్ మోహన్ బాబు, ఆయన కుమార్తె, కుమారులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరుగనున్న మంచు మనోజ్ కుమార్ వివాహా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎన్నికల ముందు మోహన్ బాబు హైదరాబాద్ వచ్చిన మోడీని కలిసి సంఘీభావం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి మోడీని మోహన్ బాబు ఆహ్వానించారు. మోడీ కూడా ఆప్యాయంగా మోహన్ బాబును పలకరించి కుశల ప్రశ్నలు వేశారు.
 
ఈ భేటీపై మంచు మనోజ్ కుమార్ స్పందించారు. తనను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవలందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారని టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ అన్నారు. మోడీని కలవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అని మీడియా ప్రశ్నించింది. 
 
దీనికి మనోజ్ స్పందిస్తూ... రాజకీయాల్లోకి వచ్చి చేరమని నన్ను అడిగారు. నేను ఆలోచించి చెబుతాను అన్నాను అని ఆ వెంటనే ఓ నవ్వు నవ్వి "ఇట్స్ జస్ట్ జోకింగ్ అండీ" అంటూ, "ఆయనో గొప్ప నేత. మేం కలవగానే సాదరంగా ఆహ్వానించారు. బాగా మాట్లాడారు. వెడ్డింగ్ కార్డును చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు" అని చెప్పుకొచ్చారు. 
 
ఆ తర్వాత మంచు విష్ణు మాట్లాడుతూ, తన సోదరుడు మనోజ్ వివాహం మే 20న జరుగనున్న నేపథ్యంలో మోడీని ఆహ్వానించేందుకు వచ్చామన్నారు. వీలైతే తప్పకుండా వస్తానని మోడీ తెలిపారని, ఆ సమయంలో చైనా పర్యటన ఉన్నట్టు తెలిసిందని వివరించారు.