'నీ జతగా నేనుండాలి'లో సినీ జర్నలిస్టు కాలర్ పట్టేసిన సచిన్
ఇక్కడ హీరోలు హీరోయిన్లు టెక్నిషియన్లు తమ శక్తికి తగినట్లు ఎలా పనిచేస్తారో వాటిని ఒకటికి పదింతలు చేస్తూ.. వర్ణిస్తూ గొప్పలుగా రాసేస్తుంటాయి కొన్ని సినిమా మేగజైన్స్. అందుకే సినిమా పరిశ్రమ మొత్తం తెలుగులో వున్నంత మంచి వాతావరణం మరే రంగంలోనూ లేదని మీడియాను తెగ పొగిడేస్తుంటారు. బాలీవుడ్లో అయితే ఈకకు ఈక లెక్కించేలా గాసిప్స్ రాసేస్తుంటారు.
దక్షిణాదిలోని కొన్ని పత్రికలు కూడా అలాగే రాస్తున్నాయి. తెలుగులో ఎల్లో జర్నలిజం పేరుతో విజయవాడ బేస్డ్తో పలు పత్రికలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా మరికొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలో ఎలక్ట్రానిక్ మీడియాలు వచ్చేశాయి. మంచి చేస్తే ఎంత పొగిడేస్తారో.. చిన్న తప్పు జరిగితే అంతకంటే రెట్టింపు బాణాలు సంధిస్తారు.
ఇటీవలే సినిమా జర్నలిజంపై కూడా సెటైర్లు వేస్తూ సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూపిస్తున్నారు. తాజాగా 'నీ జతగా నేనుండాలి' అనే సినిమాలో హీరో సచిన్ మానసిక ప్రశాంతత కోసం బయటకు రాగానే 'సినిమా పత్రిక' నుంచి వచ్చామనే శ్రీను అనే ఆర్టిస్టు... అతన్ని ప్రశ్నలు వేస్తాడు. చాలా నింపాదిగా సౌమ్యంగా సమాధానం చెప్పి సున్నితంగా హీరో తిరస్కరిస్తాడు.
పర్సనల్ లైఫ్ వద్దని.. కానీ ఆ జర్నలిస్టు మాత్రం రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన హీరో.. సినిమా పత్రిక రిపోర్టర్ కాలర్ పట్టుకుంటాడు. దాంతో అది కోర్టు కేసు వరకు వెళుతుంది. ఇదంతా సినిమా చూసే ప్రేక్షకుడికి.. హీరోపై సింపథీ వస్తుంది. మరోవైపు విలేకరిపై ఏహ్యభావం పుడుతుంది. రిపోర్టర్లు అంటే ఇలాగే బెదిరించి పబ్బం గడుపుకుంటారా! అనేంతగా వుంటుంది. ఇటువంటి సన్నివేశాలు పెట్టి.. అందరినీ ఒకేగాటన కట్టడం బాగోలేదనీ, సినిమా పిఆర్ఓ కూడా ఓ విలేకరే అని గుర్తుంచుకోవాలని... ప్రముఖ పిఆర్ఓకు చీవాట్లు పెట్టడం విశేషం. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు.