వీణామాలిక్కి 26 ఏళ్ళ ఖైదు... పైకోర్టుకెళతా .. పాకిస్థాన్ నటి!
ఇటీవల కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన పాకిస్థానీ హీరోయిన్ వీణా మాలిక్కు పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు 26 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. పాకిస్థాన్లోని జియో టీవీలో దైవదూషణ చేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీణామాలిక్కు కోర్టు శిక్ష విధించింది.
వీణా మాలిక్తోపాటు ఆమె భర్త బషీర్, టెలివిజన్ యాంకర్ షకి ష్టా వాహిది, జియో టీవీ అధిపతి మీర్ షకీల్ ఉర్ రెహ్మాన్కి కూడా కోర్టు 26 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. దైవాన్ని దూషించే కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు వీరందరూ క్షమాపణలు చెప్పారు. అయితే పాకిస్థాన్లోని అతివాదులు మాత్రం వీరికి శిక్ష విధించాలని పట్టుబట్టారు. ఈ నలుగురికీ 26 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.13 లక్షల రూపాయల జరిమానాని కూడా కోర్టు విధించింది.
కాగా, ఈ తీర్పుపై వీణామాలిక్ స్పందిస్తూ.. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్థాన్ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్టు ప్రకటించారు. తనకు దైవంపై నమ్మకం ఉందని, అందువల్ల పై కోర్టుల్లో తప్పుకుండా న్యాయం జరుగుందన్న విశ్వాసం తనకుందని ఆమె చెప్పుకొచ్చారు.