గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (16:26 IST)

అమ్మాయి చేయి పట్టుకుంటే 150 మంది... పవన్ పవర్ పంచ్...

శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో జనసేన అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌ 26 రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. తను కేవలం నటుడిని మాత్రమేననీ, నటించడం మాత్రమే తెలుసునని చెప్పిన పవర్ స్టార్... కుర్రాళ్లు తలచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. తప్పును తప్పు అని నిలదీసినప్పుడే సమాజం ఆరోగ్యవంతమౌతుందని అన్నారు.
 
రోడ్డు మీద ఓ అమ్మాయిని ఏడిపిస్తుంటే 150 మంది చుట్టూ ఉన్నా మనకెందుకులే అని వదిలేస్తుంటారనీ, కానీ వారిలో ఒక్కరు స్పందించినా మిగిలినవారు తోడు వస్తారన్నారు. అలాంటి తెగువ కుర్రాళ్లలో కావాలని ఆకాంక్షించారు.
 
విద్యార్థులతో ముఖాముఖి ప్రసంగించిన పవన్ కళ్యాణ్... రాష్ట్ర విభజనపై కూడా మాట్లాడారు. ఒకే ఒక్క జనరేషన్ చేసిన తప్పిదం వల్ల రాష్ట్రం రెండు ముక్కలైందని అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ మంగళవారం జీఎంఆర్‌ ఆస్పత్రి, జీఎంఆర్‌ సంస్థల ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న బిజినెస్‌ మీట్‌లో సమావేశంలో పవన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, మిగితా సంస్థల సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఉదయం 10 గంటలకు రాజాం చేరుకున్న ఆయన జీఎంఆర్‌ కేర్‌ ఆస్పత్రి, సంస్థలను సందర్శించారు. 
 
ఆ తర్వాత ఆయన స్థానిక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పవన్ 'స్వచ్ఛ భారత్'పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ మెగా హీరోను ప్రధాని నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా, పవన్ కల్యాణ్ రాకతో రాజాంలో సందడి నెలకొంది. తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు.