సినిమా షూటింగ్లో చుక్కలు చూపించారు : ప్రేమ ప్రయాణం హీరో
సినిమా షూటింగ్ సమయంలో నిర్మాత హోదాలో మస్తాన్ వలీ, హీరోయిన్ నీతూ అగర్వాల్కు తమకు చుక్కలు చూపించారనీ, వారి వేషాలు వర్ణించలేమని ప్రేమ ప్రయాణం హీరో మనోజ్ నందం అంటున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మస్తాన్ వలీతో పాటు నీతూ అగర్వాల్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
దీనిపై హీరో మనోజ్ నందం మాట్లాడుతూ.. ఎర్ర స్మగ్లర్ మస్తాన్ వలీ 'ప్రేమ ప్రయాణం' సినిమా నిర్మించినప్పుడు తమకు చుక్కలు చూపించేవాడన్నారు. సినిమా షెడ్యూల్ ప్రకారం జరగలేదని, దానికి కారణం వారిద్దరిమధ్య ఉన్న సన్నిహిత సంబంధాలేనని వెల్లడించాడు. స్పాట్లో నిర్మాత లేకపోతే నీతూ అగర్వాల్ షూటింగ్ జరగనిచ్చేది కాదని, తలనొప్పి అనో లేక ఇంకోటనో చెప్పి షూటింగ్ ఆపేసేదని, దాని కారణంగా తాను రెండు అవకాశాలు కోల్పోయానని మనోజ్ నందం వాపోయాడు.
ఇప్పటి వరకు తాను ఆ సినిమానే చూడలేదని, ఎందుకంటే సినిమాను వాళ్లు ఇష్టపడి తీయలేదని, అసలు సినిమా పూర్తవుతుందని కూడా తాను భావించలేదన్నారు. నీతూ కోసం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తానని మస్తాన్ వలీ చెప్పేవాడని, ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయని మనోజ్ నందం వెల్లడించాడు. షూటింగ్లో ఎవరూ ఇబ్బంది పెట్టకుండా విపరీతంగా డబ్బు వెదజల్లేవాడని మనోజ్ తెలిపాడు.