శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 29 మే 2015 (20:19 IST)

రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజా కాంబినేషన్‌లో 'రాజా & రాజా ప్రొడక్షన్స్'

నటకీరిటి రాజేంద్రప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. ఇచ్చిన మాటను తప్పకుండా పేద కళాకారులకు చేదోడువాదోడుగా నిలుస్తూ.. వారి సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నటుడు శివాజీరాజా 'మా' జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ రాజేంద్రప్రాసద్‌కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. అయితే శివాజీరాజా-రాజేంద్ర ప్రసాద్ అనుబంధం ఒక్క మా బంధం మాత్రమే కాదు. గత 30 ఏళ్ళుగా మంచి మిత్రులుగా వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అందులో భాగంగానే రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజా కలిసి ఒక కొత్త బ్యానర్‌ను స్థాపించబోతున్నారు.
రాజా అండ్ రాజా ప్రొడక్షన్స్
 
రాజేంద్రప్రసాద్-శివాజీరాజాలు కలిసి టీవి మరియు ఫిల్మ్ ప్రొడక్షన్స్‌ను.. రాజా&రాజా ప్రొడక్షన్స్ (ఆర్&ఆర్ ప్రొడక్షన్స్) పేరిట మొదలు పెట్టబోతున్నారు. అందుకు ఈ రోజు అనగా మే 29న ముహూర్త కార్యక్రమం జరుపుకుంది. ఈ సందర్భంగా రాజా & రాజా ప్రొడక్షన్స్ గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. రాజా & రాజా ప్రొడక్షన్స్‌లో ముఖ్యంగా టీవి కార్యక్రమాలతో పాటు సమాంతరంగా సినిమాలను కూడా నిర్మించబోతున్నాం. త్వరలోనే 'ఈ' టీవిలో ఓ ప్రొగ్రామ్‌ను మా బ్యానర్‌లో మొదలుపెట్టబోతున్నాం. 
 
అలాగే మిగతా అన్ని ఛానల్స్‌లోనూ మరిన్ని మంచి ప్రొగ్రామ్స్ అందించబోతున్నాం. రాబోయే కాలంలో మా బ్యనర్ పేరు నిలబెట్టే  మంచి మంచి టీవి కార్యక్రమాలతో పాటు సినిమాలను నిర్మించడమే మా ధ్యేయం. మా ఇద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న రాజా & రాజా ప్రొడక్షన్స్ విజయపథంలో సాగాలని.. అందుకు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తర్వాతే ఈ కార్యక్రమం జరుపాలనుకున్నప్పటికీ.. ఈ రోజు (మే 29) బాగుండటంతో ముహూర్తం కార్యక్రమం మాత్రమే జరిపినట్టు తెలియజేశారు. మిగతా విషయాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
 
రాజా & రాజా ప్రొడక్షన్స్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా రాజేంద్రప్రసాద్ తనయుడు బాలాజీ.. శివాజీ రాజా అల్లుడు కిరణ్ కుమార్ వర్మ వ్యవహరించనున్నారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కైకాల సత్యనారాయణ.. నాగిరెడ్డి-చక్రపాణిలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలను ఆశీర్వదించారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డితో పాటు మరి కొంతమంది సినీ ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి విచ్చేసి తమ తమ బెస్ట్ విషెష్‌ను అందించారు.