దోచుకుంటారని పుకార్లు పుట్టించారు... సినీ పెద్దలను హెచ్చరించిన తలసాని...
చలనచిత్రరంగంలోని కొంతమంది నిర్మాతలకూ, నటులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇండస్ట్రీలో మోనోపొలీ ఇంతకుముందు వుండేది. దానికి గండి వేసిన సందర్భమే రాజేంద్రప్రసాద్ గెలుపు. ఇకపోతే ఇక్కడివారు కొంతమంది పాత అలవాట్లను మార్చుకోవాలి. ఊరికే చంద్రబాబు చుట్టూ తిరిగేవారు జాగ్రత్త. ఆయన ప్రభుత్వంలో 24 గంటలూ ఆయన చుట్టూ తిరిగేవారు. ఇక్కడ వున్నది కెసిఆర్ ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా నిలబడేది మేమే.. అంటూ హెచ్చరించారు.
హైదరాబాద్లో ఉన్నవారంతా తెలంగాణవారే..
ఇంకా మాట్లాడుతూ... సినీ కార్మికులకు, సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. సినీ కార్మికులకు ఇళ్ళు, స్థలాలు ఇచ్చే విషయంలో కృతనిశ్చయంతో వుంది. సాధారణ ప్రజలకు వర్తించే అన్ని పథకాలు, అర్హులైన సినీ కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణ వస్తే కెసిఆర్ సినిమా వాళ్ళ ఆస్తులు దోచుకుంటారని పుకార్లు పుట్టించారు. అదంతా నిజం కాదు. ఆయన పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. ఫెడరేషన్ కృషిని దాసరి వివరించారు.
ఆ రోజుల్లో ఎన్టిఆర్, ఎఎన్ఆర్, దాసరి కృషి ఫలితంగానే ఇండస్ట్రీ ఇక్కడ నెలకొంది. ఇండస్ట్రీకి మా ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. 24 క్రాఫ్ట్స్ వారు మిగిలినవారినీ కలుపుకుపోవాలి. టాలెంట్ వుంటే ప్రమోట్ చేయాలి. టాలెంట్ను గుర్తించకపోతే సమస్యలొస్తాయి. అవి మరో సమస్యకు దారితీస్తుంది. సినిమా పరిశ్రమ గురించి బాగా తెలుసు. యూనియన్స్లో రకరకాల సమస్యలున్నాయి. నా దృస్టికి వచ్చినప్పుడు వారితో మాట్లాడతాను. అందరికీ న్యాయం చేయాలనే మా ప్రభుత్వం చూస్తుంది. హైదరాబాద్లో వున్నవారంతా తెలంగాణవాళ్ళే. సినీకార్మికులకు కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.