టీమిండియా ఓడిపోయిందోచ్.. యమా హ్యాపీ.. పదే పదే ఓడించాలి.. వర్మ ట్వీట్..!
వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చాడు. ఈసారి ఏకంగా టీమిండియాపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సెమీఫైనల్లో భారత్ ఓటమిపై ట్విట్టర్లో రామ్గోపాల్వర్మ ఘాటుగా స్పందించారు. ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. క్రికెట్ అంటే తనకు చిరాకని, అస్సలు నచ్చదని, ఎందుకో కూడా చెప్పుకొచ్చారు.
క్రికెట్ పిచ్చిలో పడిపోయిన ఇండియన్లు పనులు మానేసి టీవీలకు అతుక్కు పోతున్నారన్నారు. క్రికెట్ పిచ్చి నుంచి ఇండియన్లను కాపాడాలని భగవంతుడిని కోరుకుంటానన్నారు. భారతీయులు ప్రమాదకరమైన జబ్బు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
క్రికెటెటీస్ అనే వ్యాధి బారిన పడిన ఇండియన్లను కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిస్తానని వర్మ చెప్పారు. టీమిండియా జట్టును పదేపదే ఓడించాలని తాను మిగిలిన దేశాలను కోరుతున్నానన్నారు. ఈ దెబ్బతోనైనా... క్రికెట్ పిచ్చి నుంచి బయటకు రావాలన్నారు. ఇప్పటికైనా క్రికెట్ చూడటం మానేసి... ఎవరి పని వారు చేసుకోవాలంటూ వర్మ ట్విట్ చేశారు.