తెలుగు సినీ ఇండస్ట్రీ కార్మికులు రోడ్డెక్కారు!
ప్రస్తుతం తెలుగు సినిమాకు చెందిన 24 క్రాఫ్ట్కు చెందిన కార్మికులంతా రోడ్డునపడ్డారు. అంటే పనీపాటా కోసం కాదు. వారికి తగిన పారితోషికం ఇవ్వాలని. గత కొన్నేళ్ళుగా కార్మికుల చట్టంలోని పాత నిబంధన ప్రకారం.. ఇస్తున్న వేతనాలను రెండేళ్ళకొకసారి పెంచాల్సి వుంటుంది. కానీ చాలామంది నిర్మాతలు దానికి అనుగుణంగా ఇవ్వకపోడంతో గత ఏడాది జూన్లో దీక్షలు చేపట్టారు.
రెండు రాష్ట్రాల విభజన గొడవలో అది సద్దుమణిగింది. ప్రస్తుతం తెలంగాణ కార్మికులుగా సెపరేట్ అయినా.. వారికి సరైన యూనియన్లు లేకపోవడంతో.. ఇప్పుడు అంతా కలసికట్టుగా సమ్మె చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా సాగుతున్న ఈ సమ్మె.. శుక్రవారంతో తెరపడే సూచనలు కన్పిస్తున్నాయి.
ఛాంబర్ పెద్దలు కలుగజేసుకుని.. అన్ని శాఖల నాయకులు రాజీపడే ప్రయత్నాలు చేశారు. జూనియర్ ఆర్టిస్టుకు 750 నుంచి 1000 రూపాయల వరకు రోజుకు వేతనం వుంటుంది. అదేవిధంగా ఆర్ట్, లైట్బాయ్.. ఇలా అన్ని శాఖలకు ప్రస్తుతం వున్న వేతనాలను 50 శాతం పెంచాలని కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తుంది. అధ్యక్షుడు కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు దాసరి మద్దతుందని తెలుస్తోంది.