శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 23 మే 2016 (14:34 IST)

నాడు హీరో.. నేడు విలన్.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న 'జగ్గూభాయ్'

ఒకప్పుడు హీరోగా మగువల హృదయాల్ని కొల్లగొట్టిన జగపతిబాబు ఇప్పుడు ప్రతినాయకుడిగా మారి సంచలనం సృష్టిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా నాలుగు భాషల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నారు. విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో తనేంటో నిరూపించుకున్నాడు. బాలకృష్ణ 'లెజెండ్‌'లో ప్ర‌తిక‌థానాయ‌కునిగా పరిచయమయ్యాడు. దీంతో జగపతిబాబు రాతే మారిపోయింది. ఇప్పుడు జగపతిబాబు తెలుగు చిత్ర సీమలో ఖ‌రీదైన క్యారెక్టర్ న‌టుడు, ప్ర‌తి క‌థానాయ‌కుడు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తిబాబు ఒక సినిమాకి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.
 
ఆయనని ప్ర‌తి క‌థానాయ‌కునిగా తీసుకోవడానికి టాలీవుడ్ దర్శక, నిర్మాతలందరూ ఆయన ఇంటిముందు క్యూకడుతున్నారు. కేవలం తెలుగు చిత్రసీమలోనే కాదు ఇప్పుడు జగపతిబాబుకి తమిళ, మలయాళ చిత్ర సీమల నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వచ్చి పడిపోతున్నాయి. అయితే జగపతిబాబు ప్రస్తుతం ప్ర‌తిక‌థానాయ‌కునిగా అగ్రహీరోల సినిమాల్లోనే నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా కన్నడలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రంలో కీలకపాత్రను పోషించడానికి జగపతిబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 
 
ఇటీవలే మీడియాతో జగ్గూబాయ్ మాట్లాడుతూ... ఈ సినిమాలో విలన్ పాత్రకు ముఖ్యత్వం ఉండటంతో అది తనకి నచ్చడంతో చేస్తున్నానని తెలిపారు. షూటింగ్ స్పాట్‌లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి తన స్థాయిని పక్కనపెట్టి ఆత్మీయంగా మెలగడం చాలా సంతోషాన్ని, ఆశ్చర్యపరిచిందన్నారు. చిత్ర హీరో నిఖిల్ అంకిత భావంతో పని చేసే నటుడని మెచ్చుకున్నారు. ఈ సినిమా హిట్ కేటగిరీలో చేరితే, అక్కడ కూడా జగపతిబాబు ఒక రేంజ్‌లో బిజీ అయ్యే అవకాశాలు లేకపోలేదు.