ఏపీలో మల్టీప్లెక్స్లపై రామోజీరావు కన్ను...?!
ప్రముఖ వ్యాపారవేత్త, స్టూడియో అధినేత, నిర్మాత రామోజీరావు ప్రస్తుతం మల్టీప్లెక్స్ నిర్మాణంలో ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లుగా... రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్కు మరో మార్గం మల్టీప్లెక్స్ నిర్మాణాలే అని చెప్పారు. థియేటర్లతోపాటు కమర్షియల్ వ్యాపార కాంప్లెక్స్లు అందులో వుండటం వల్ల ఇవి అందరికీ అందుబాటులో వుంటాయని ఆయన ఉద్దేశ్యం.
దీనిపై మొదటగా రామోజీరావు శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు చలనచిత్ర రంగంలోని ఆ నలుగురు పెద్దల్ని సంప్రదించి.. వారి సహకారాన్ని కోరినట్లు కథనాలు విన్పిస్తున్నాయి. అందుకు వారు గౌరవంగా ఆయన్ను ఆహ్వానించారట. దీంతో నవ్యాంధ్రప్రదేశ్లో రామోజీ థియేటర్లు వుంటాయన్నమాట.
దాదాపు 200 నుంచి 300 వరకు కెపాసిటీ వుండే ఇటువంటి థియేటర్లు అందరికీ వుపయోగపడతాయని అంటున్నారు. గతంలో విజయవాడలో రంభ, ఊర్వశి, మేనక థియేటర్లు వుండేవి. అవి ఇప్పుడు మల్టీప్లెక్స్ల్లా మారిపోయాయి. ఇంకా ఎన్ని మారుతాయో చూడాల్సిందే.