సినీ పరిజ్ఞానం పెంపొందించేందుకు క్లాస్రూమ్ సినిమా ఫౌండేషన్ : దర్శకుడు అల్లాణి శ్రీధర్
ప్రముఖ దర్శక నిర్మాత అల్లాణి శ్రీధర్ బాలబాలికల్లో సినిమా పరిజ్ఞానం కలిగించడం కోసం స్కూల్ స్థాయి నుండే వారికి సినిమా పట్ల అవగాహన కలిగించడం కోసం క్లాస్రూమ్ సినిమా అనే నినాదంతో క్లాస్ రూమ్ సినిమా ఫౌండేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాస్ రూమ్ సినిమా విధి విధానాలతో పాటు విడుదలకు సిద్ధంగా ఉన్న చిలుకూరి బాలాజీ చిత్ర విశేషాలను తెలయజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పిల్లలకు అన్నీ దొరుకుతున్నాయి.. చిన్న పిల్లలకు బొమ్మలు, దుస్తులు, పుస్తకాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వారి జీవితాన్ని ప్రభావితం చేసే సినిమా తప్ప, చుదువుకునే పిల్లలకు ఆ లోటును పూడ్చడానికి మేం క్లాస్ రూమ్ సినిమా ఫౌండేషన్ను స్థాపిస్తున్నాం. గతంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నేను జూరీలో ఉన్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. అప్పుడు నా సహచర సభ్యులతో ఛైర్మెన్తో ఈ ఆలోచన పంచుకున్నప్పుడు వారు ఎంతగానో సంతోషపడి మీ ఆలోచన బాగుంది. దాన్ని ఆచరణలో పెట్టండి మేం కూడా దీనికి సహకరిస్తాం అని వారి మద్దతును తెలియజేశారు.
త్వరలో ఈ క్లాస్ రూమ్ సినిమా ఫౌండేషన్ను ప్రారంభించనున్నాం. చిన్న పిల్లలు తాము ఎదుగుతున్న సమయంలో హింసాత్మక సినిమాలు చూడటం ద్వారా వారు హింసాయుతంగా తయారవుతున్నారు. స్కూల్లో పిల్లలకు నీతి పాఠాలు బోధించడం కంటే పిల్లల కోసం పిల్లల బయోపిక్స్, లఘు చిత్రాలు చూపించడం ద్వారా చక్కటి విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. బాల బాలికల కోసం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపే బాలుర అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కంటే వారానికి ఒక ప్రతి శనివారం ఒక అరగంట ఈ తరహా సినిమా ప్రదర్శించడం ద్వారా పిల్లల్లో సినిమా పట్ల అవగాహన పెరిగే విధంగా చేయవచ్చు.
ఈ సిఆర్సి(క్లాస్రూమ్ సినిమా)లో సినిమాలు తీయడం కోసం కొంత ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మరికొంత కార్పొరేట్ సంస్థల సహకారం కూడా తీసుకుంటాం. ఇప్పటికే ఈ సిఆర్సిని ఎలా చేయాలనే విధివిధానాలను తయారు చేసుకోవడంతో పాటు పలువురు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించడం జరిగింది. దీన్ని నిర్వహించడాని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాకారం తీసుకోనున్నాం.
ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈటీవీతో కలిసి రూపొందించిన చిలుకూరు బాలాజీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఆ సినిమా విడుదలైన తర్వాత మా సంస్థ మరో సినిమాను కూడా రూపొందించడానికి సమాయత్తమవుతోంది. దేశ విదేశాల్లో సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది.. కొందరు ఆత్మీయమిత్రులు సినిమాను విదేశాల్లో విడుదల చేయడానికి తమ తోడ్పాటునందిస్తారు. చినజీయర్ స్వామి వారు ఏర్పాటు చేసిన ఈ సినిమా ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 'కొమరం భీమ్' హిందీలో పునర్ నిర్మించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
ఇదికాకుండా మా సంస్థ బంగారు తెలంగాణే లక్షంగా స్వచ్ఛందంగా విభిన్నమైన లఘు చిత్రాలను నిర్మించబోతున్నాం. దీంతో పాటు ప్రస్తుతం చాలా మంది లఘు చిత్రాలను తీస్తున్నారు. కానీ వారు ఏమి తీస్తున్నారో తెలియడం లేదు. అలాంటివారికి ఎలాంటి లఘు చిత్రాలు తీస్తే బాగుంటుంది అనేదాంట్లో తర్ఫీదు నివ్వనున్నాం అని చెప్పుకొచ్చారు.