శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:01 IST)

అవార్డులు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదు... ప్రకాష్ రాజ్ వివరణ

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడకుంటే తనకు ఇచ్చిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తిరిగి ఇస్తేస్తానని ప్రకటించిన నటుడు ప్ర

బెంగుళూరులో దారుణ హత్యకు గురైన సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడకుంటే తనకు ఇచ్చిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తిరిగి ఇస్తేస్తానని ప్రకటించిన నటుడు ప్రకాష్ రాజ్ మాట మార్చారు. అవార్డులు తిరిగిచ్చేంత మూర్ఖుడిని కాదంటూ స్పష్టత ఇచ్చారు. సోమవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్య‌పై మోడీ మౌనంగా ఉండ‌టం ప‌ట్ల‌ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అంతేకాకుండా, మోడీ తనకంటే మహా నటుడు అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు పలు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వచ్చాయి. 
 
వీటిపై ప్రకాష్ స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేద‌ని, తాను ఒక‌టి చెప్తే మ‌రొక‌టి అర్థం చేసుకున్నార‌న్నారు. దానికి సంబంధించి ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. 'నేను మాట్లాడిన విష‌యాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అవార్డులు తిరిగి ఇచ్చేస్తాన‌ని వ‌స్తున్న వార్త‌లు చాలా హాస్యాస్ప‌దంగా ఉన్నాయి. నేను క‌ష్ట‌ప‌డి ప‌ని చేసి గెల్చుకున్న అవార్డుల‌ను తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాను. అవి నాకు గ‌ర్వ‌కార‌ణం' అని వీడియోలో వివ‌రించారు. 
 
గౌరీ లంకేశ్ హ‌త్య గురించి తాను మాట్లాడిన విష‌యాల‌పై ఆయ‌న స‌రైన అర్థాన్ని కూడా చెప్పారు. 'అంతటి గొప్ప పాత్రికేయురాలు హత్యకు గురైతే మన ప్రధాని ఇప్పటివరకు పెదవి విప్పకపోవడం ఏం బాగోలేదు. ఈ విషయంలో ఆయ‌న‌ మౌనంగా ఉంటే ఓ పౌరుడిగా నాకు భయమేస్తోంది. తీవ్రంగా బాధ కూడా క‌లుగుతోంది. అందుకే ఓ పౌరుడిగా నాకు అలా అనే హక్కు ఉంది కాబ‌ట్టి స్పందించాను. కానీ దాన్ని వ‌క్రీక‌రించి ప్ర‌కాశ్‌ రాజ్‌ అవార్డులు ఇచ్చేస్తానన్నారు అని ప్రచారం చేయడం స‌బ‌బు కాదు. నాకు అవార్డులు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన కూడా లేదు' అని ఆయన వివరించారు.