బాహుబలి 2 షూటింగ్: అరుపులు, కేకలతో.. ఏనుగు ఇబ్బంది.. అరెస్ట్ చేయాలని?
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కేరళలోని త్రిశూర్లో ఈ సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్తో ఓ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షూటింగ్లో ఏనుగులు కూడా పాల్గొన్నాయి. దీనిపై జంతు హక్కుల పరిరక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా బాహుబలి దర్శకుడు, నిర్మాతల్ని అరెస్ట్ చేయాలని 'యానిమల్ టాస్క్ ఫోర్స్' బృందం డిమాండ్ చేసింది.
భారత వన్యమృగ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే బాహుబలి 2 చిత్రంలో ఏనుగును షూటింగ్ కోసం ఉపయోగించారని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం ఆరోపిస్తోంది. షూటింగ్ జరుగుతున్నంతసేపు యూనిట్లో 50కి పైగా ఉన్నవారు అరుపులు, కేకల వల్ల ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం వెల్లడించారు. తద్వారా వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను ఉల్లంఘించినట్లైందని.. అందుకే ఈ సినిమా దర్శకనిర్మాతలను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఆదేశించాల్సిందిగా వీకే వెంకటాచలం అన్నారు.