అపుడు కష్టపడినప్పటికీ పేరు రాలేదు... 'జెంటిల్మన్'లో ఆ 10 నిమిషాలే కీలక : హీరో నాని
ఇంద్రగంటి దర్శకత్వంలో 'జెంటిల్మన్' సినిమా చేయడంతో నా గౌరవం పెరిగింది. ఈ సినిమాకు ముందు 'జెండాపై కపిరాజు' అనే చిత్రంలో డబుల్ రోల్ చేశాను. ఆ సినిమాలో చాలా కష్టపడినప్పటికీ ఈ సినిమాకి వచ్చి
ఇంద్రగంటి దర్శకత్వంలో 'జెంటిల్మన్' సినిమా చేయడంతో నా గౌరవం పెరిగింది. ఈ సినిమాకు ముందు 'జెండాపై కపిరాజు' అనే చిత్రంలో డబుల్ రోల్ చేశాను. ఆ సినిమాలో చాలా కష్టపడినప్పటికీ ఈ సినిమాకి వచ్చినంత పేరు రాలేదు. ఇంద్రగంటి ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఎగ్జయిట్మెంట్ ఉండేది. అలాగే ఈ సినిమాలో శ్రీని నెగటిల్ రోల్ చేయబోతున్నాడని ఇంద్రగంటి చెప్పగానే ఎంతో హ్యపీగా అనిపించింది. మా కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన నాలుగు సినిమాలు మంచి సక్సెస్ను సాధించాయి. ఇప్పుడు మా కాంబినేషన్లో రానున్న ఐదో సినిమాపై ఎగ్జయిట్మెంట్ పెరిగింది. సినిమాలో చివరి 10 నిమిషాలు చాలా కీలకం. కథలోని ప్రతి ప్రశ్నకు అందులో సమాధానం దొరికేలా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సినిమా అంత బాగా ఎడిట్ చేసిన మార్తాండ్ కె.వెంటకేష్ ప్రత్యేక ధన్యవాదాలు.
అలాగే సినిమాటోగ్రాఫర్ తన ప్రతి ఫ్రేమ్లో దర్శకుడు చెప్పాలనుకున్న మూడ్ను క్యారీ చేసిన విధానంతో ఎంతో ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య వంటి పాత్రలో అమాయకమైన సురభి ఒదిగిపోయింది. అలాగే నివేదతో యాక్ట్ చేయడం గర్వంగా ఫీలవుతున్నాను. కృష్ణప్రసాద్తో సినిమా అనగానే ముందు ఆయనేం సినిమాలు చేశారో తెలియలేదు. అయితే ఆయన చేసిన 'ఆదిత్య 369' పేరు చెప్పగానే ఆయనపై మరింత గౌరవం పెరిగింది. కృష్ణప్రసాద్ చాలా క్లియర్గా తన విషయాలను చెప్పేసేవారు. మీరు అనుకున్న దానికంటే సినిమాను బాగా తీస్తానన్న ఆయన, చెప్పిన దాని కంటే సినిమాను మూడు రెట్లు బాగా తీశారు. ఆయన ప్రొడక్షన్లో మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నాం. ఇక మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఆడియెన్స్ క్లాప్స్ కొడుతున్నారంటే ఆయనెలాంటి కష్టపడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాకు 'ఇంద్ర', 'సమరసింహా రెడ్డి' వంటి సినిమాలు చేయాలని లేదు కానీ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే అలాంటి సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్లో భాగమైన అందరికీ థాంక్స్ నాని చెప్పుకొచ్చారు.
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'జెంటిల్మన్'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. 'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సక్సెస్మీట్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... 'నేను 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'ఊయల' ఇలా చేసిన సినిమాలన్నీ మంచి కథలను ఆధారం చేసుకునే చేశాను.
అలాగే డేవిడ్ నాథన్ ఈ కథ చెప్పగానే నాకు నచ్చింది. నేను డైరెక్టర్ ఇంద్రగంటిని వినమన్నాను. ఆయనకు వినగానే నచ్చడంతో ఇదే కథతో సినిమా చేద్దామన్నారు. మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేశారు. నాని అయితే న్యాయం చేస్తాడని అనడంతో నానిని కలిశాం. అప్పుడే 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా విడుదలై ఉంది. నేను 'భలే భలే మగాడివోయ్', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాలు తర్వాత చేస్తానని అన్నమాట ప్రకారమే ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా సక్సెస్ నాకొక పెద్ద కమ్ బ్యాక్, ఎనర్జీని ఇచ్చింది. డ్యూయెల్ రోల్లో నాని అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. సినిమా విజయంలో భాగమైన యూనిట్కి, సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్' అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ... నేను సంస్కారవంతమైన, సంసారవంతమైన, సెన్సార్ వంతమైన సినిమాలు చేస్తాననే పేరు ఉంది. ఇంతకుముందు నా దర్శకత్వంలో వచ్చిన సినిమాలను చూసి నేను ఇలాంటి సినిమా చేస్తానని ఎవరూ అనుకుని ఉండరు. జయాపజయాలతో సంబంధం లేకుండా నన్ను నమ్మి ఈ సినిమా చేయమని చెప్పిన శివలెంక కృష్ణప్రసాద్కి థాంక్స్. డేవిడ్ నాథ చాలా మంచి కథను అందించారు. నానికి నేను బ్రేక్ ఇచ్చానని చాలా మంది అనుకుంటారు. కానీ 'అష్టాచమ్మా' మూవీ నానికి ఎంత అవసరమో నాని అవసరం కూడా ఆ సినిమాకు అంతే ఉంది. నాని, శ్రీని యాక్టింగ్ చూసి భవిష్యత్లో ఇద్దరు పెద్ద స్టార్స్ అవుతారని అప్పుడే చెప్పాను. 'ఎవడే సుబ్రమణ్యం' వంటి డీసెంట్ సక్సెస్ తర్వాత నాని ఇలాంటి కథను నమ్మి ఒప్పుకున్నందుకు తన గట్స్కు థాంక్స్. అలాగే నివేద, సురభి వారి వారి పాత్రల్లో జీవించారు. నేను ఏదైతే మనసులో చూశానో దాన్ని తెరపైన చూపించిన సినిమాటోగ్రాఫర్ విందాకి, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్కు అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు.
అవసరాల శ్రీని మాట్లాడుతూ... ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి కథకుడు అని ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. ఆయన ఈ చిత్రంతో నానిలోని మరో యాంగిల్ను బయటకు చూపించారు. ఇటువంటి మంచి చిత్రాన్ని నిర్మించిన శ్రీదేవి మూవీస్ బ్యానర్ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు.