నటుడు కళాభవన్ మృతి కేసు : శరీరంలో మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు
కేరళ రాష్ట్రానికి చెందిన నటుడు కళాభవన్ మణి మృతిపై ఉన్న సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. మృతదేహంలో మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు.
గత యేడాది మార్చి ఆరో తేదీన కళాభవన్ మణి మరణించిన విషయం తెల్సిందే. ఈయన మృతిపై అనుమానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు కనుగొన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. ఈ నివేదికపై స్పష్టత కోసం కేరళ పోలీసులు సీఎఫ్ఎస్ఎల్ను సంప్రదించనున్నారు. అయితే, మణి శరీరంలో ఎంత శాతం మేరకు ఈ రసాయన పదార్థం ఉందో మాత్రం వెల్లడించలేదు.