శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (15:32 IST)

సినిమాల కంటే.. నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం : కళ్యాణ్ రామ్

తనకు సినిమా కంటే తన కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాత నందమూరి అభిమానులని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... తన కుటుంబంలో వ్యక్తులను వేరు చేసి మాట్లాడవద్దని అభిమానులకు సూచించారు.
 
 
తాతగారు తమ అందరికీ కల్పవృక్షమని, ఆ వృక్షం నుంచి తామంతా వచ్చామన్నారు. పైగా.. ఆయన నెలకొల్పిన సంప్రదాయంలో బాబాయ్, ఆ తర్వాత తన తండ్రి, ఆ తర్వాత తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, తాను, తన సోదరులు వచ్చామన్నారు. తమను వేరు చేసి మాట్లాడవద్దని, తామంతా ఓకే కుటుంబమని, ఆయన నెలకొల్పిన సంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని, ఇందులో అందరం ఒకటేనని, తమదంతా నందమూరి కుటుంబమని కల్యాణ్ రామ్ స్పష్టం చేశారు. 
 
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా, అభిమానులు తమను ఏ విధంగా అభిమానిస్తున్నారో మీకు తెలుసని, అలాంటపుడు వేరుచేసి ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. ఇకపై మనమంతా ఒకే కుటుంబమన్నారు. అభిమానుల ఆదరణే తమ కుటుంబానికి అండ అని కల్యాణ్ రామ్ చెప్పారు. అందువల్ల తనకు సినిమాల కంటే తన ఫ్యామిలీ, ఆ తర్వాత అభిమానులే ముఖ్యమన్నారు. 
 
ఇకపోతే.. ఈ సినిమా అంగీకరించినప్పుడు మల్లి (దర్శకుడు)కి ఎందుకు మూడో సినిమా చేస్తున్నావని చాలా మంది అడిగారని, ఫెయిల్యూర్స్ జీవితంలో సర్వసాధారణమని, మల్లి జీవితానికి హిట్ చాలా అవసరమని, అందుకే తాను మల్లికి ఈ సినిమా చేశానని కల్యాణ్ రామ్ తెలిపాడు. ఒక సినిమా హిట్‌తో గత వైఫల్యాలు మరచిపోవచ్చన్నారు. తనకు కూడా ఎన్నో అపజయాలు ఉన్నాయని గుర్తు చేసిన కళ్యాణ్ రామ్.. ఈ చిత్రం మల్లి కోసం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.