జాతీయ దర్శకుడు మళ్ళీ వెలుగులోకి!
జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు అవార్డులేదంటున్న సమయంలో ఆరు జాతీయ పురస్కారాలు, నాలుగు నంది అవార్డులు రెండు అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకున్న దర్శకుడు కెఎన్టి శాస్త్రి. తెలుగులో 'తిలదానం'కు ఆ అవార్డులు వచ్చాయి. చాలాకాలం గ్యాప్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం బాలల చిత్రాన్ని తీసే పనిలో వున్నాడు. దీనికి 'శాణు' అనే పేరు పెట్టారు. బేబి జాహ్నవి, మాస్టర్ సాకేత్ ప్రధాన పాత్రల్లో కనబడబోతున్నారు.
రెండే ప్రధాన పాత్రల్లో సాగనున్న ఈ చిత్రం పిల్లల నమ్మకాలు, ఖోఖో ఆటలపై సాగుతుంది. ఖోఖోకు ఏ సినిమాలో ప్రధాన పాత్ర ఇవ్వలేదని, అందుకే ఈ నేపథ్యం తీసుకున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. బడిలో మంచి ఆటగత్తెగా శాణు (శ్రావణి) పేరు తెచ్చుకుంటుంది. అయితే అనుకోని మలుపుతో చిత్రం మరో కోణంలోకి వెళుతుంది అని దర్శకుడు చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి ప్రాంతాల్లో త్వరలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: కాశీభట్ల వేణుగోపాల్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కెఎన్టి శాస్త్రి.