సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనవడు హీరోగా 'కౌసల్య'
ఇప్పటివరకు సినిమా ఫీల్డుకు సంబంధించిన వారసులు నటులుగా మారారు. రాజకీయ రంగానికి చెందినవారు చాలా అరుదు. ఇప్పుడు సినిమా రంగంలో.. కమ్యూనిస్టు నాయకుడు వారసుడు హీరో అయిపోయాడు. సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ మనవుడు శరత్ కళ్యాణ్ హీరో అయిపోయాడు. జనని క్రియేషన్స్ పతాకంపై శరత్ కళ్యాణ్, అభిషేక్ రంజన్, అజయ్ దీవా, విక్రమ్, శ్వేతా ఖడే ముఖ్య తారాగణంగా మధుసూదన్ సామల, రమేష్ బాబు పెంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కౌసల్య'. సహనిర్మాతలు: రవీందర్రెడ్డి చింతకుంట, రవి గుమ్మడిపూడి.
ఈ సినిమా ద్వారా వర్ధమాన సంగీత దర్శకుడు మహేష్ ఆపాల దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ల్యాబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్ కలిసి బిగ్ సిడీను ఆవిష్కరించారు. టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాంతారావు ఆడియో సీడీలను విడుదల చేసారు.
ఈ సందర్భంగా... సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ''ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఒక హీరోగా నా మనవడు శరత్ కళ్యాన్ నటించాడు. సినిమా ట్రైలర్స్, సాంగ్స్ చాలా బావున్నాయి. ఇటీవల రాజకీయాలకు, సినిమాలకు మధ్య అవినాభావన సంబంధం ఉన్నట్లనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయనాయకులు నమ్మశక్యం కాని హామీలిస్తుంటే జనాలు వోట్లు వేస్తున్నారు. అలానే నమ్మశక్యం కాని చిత్రాలను తెరకెక్కిస్తుంటే ప్రజలు వాటినే ఆదరిస్తున్నారు.
సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రావాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే హీరోలు కొత్తవారైనా బాగా నటించారు. చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది. కొంతమంది నిర్మాతలు వారి కుమారులనే హీరోలుగా పెట్టి సినిమాలను నిర్మించి థియేటర్లు ఆక్యుపై చేస్తున్నారు. చిన్న సినిమాలను కూడా ప్రోత్సాహించాలి. ఈ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు'' అని చెప్పారు.