బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (05:58 IST)

నేడు సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి... (Bhaja Govindam Audio)

ఆ స్వరం దేవదేవుని మేలుకొలుపు. ఆ రూపం భారతీయతకు నిండుజాబిలి. పారవశ్యభక్తితత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం. ఆమే.. సంగీత కళానిధి, సంగీత సరస్వతి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మీ.. సెప్టెంబరు 16వ తేదీ ఆమె జయం

ఆ స్వరం దేవదేవుని మేలుకొలుపు. ఆ రూపం భారతీయతకు నిండుజాబిలి. పారవశ్యభక్తితత్వ ఆలాపనకు నిలువెత్తు నిదర్శనం. ఆమే.. సంగీత కళానిధి, సంగీత సరస్వతి, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి.. సెప్టెంబరు 16వ తేదీ ఆమె జయంతి. దీన్ని పురస్కరించుకుని ఆమెను ఓ సారి స్మరించుకుంటే...
 
సుబ్బులక్ష్మి సంగీత తరంగమే కాదు.. వెండితెర వెలుగు కూడా. అప్పటివరకు సాంప్రదాయ సంగీతంలో పేరుగడించిన సుబ్బులక్ష్మి అసలు పేరు మదురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. 1916 సెప్టెంబర్ 16న మదురైలో జన్మించారు. ఎంఎస్ తల్లిదండ్రులు సుబ్రమణ్య అయ్యర్, షణ్ముగ వడివు అమ్మాల్. కర్ణాటక సంగీత శాస్త్రీయ, ఆర్థశాస్త్రీయ గీతాలాపనలో నేటికి ఆమెకు సారిరారు ఏనాటికి అనేవిధంగా ఆమె గాత్రం అజరామరంగా సాగింది. చిన్నవయస్సుల్లో ముద్దుగా కుంజమ్మ అని పిలుచుకున్న ఎంఎస్ అతిపిన్న వయస్సులోనే ఆమె ఆది గురువైన తల్లి షణ్ముగ వడివు ద్వారా సంగీత ప్రస్థానం మొదలు పెట్టారు. 
 
పదేళ్ల వయస్సు నుండే కచ్చేరీలు ప్రారంభించారు. ఆమెలో భక్తి బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రమణ్య అయ్యరే అని చెప్పుకోవచ్చు. చిరుప్రాయం నుండే సంగీత సరస్వతిగా పిలువబడిన ఎంఎస్ 1938లో సినీ సంగీతంలోకి అడుగు పెట్టారు. 'సేవాసదనం' అనే చిత్రం ద్వారా సినీ గాయకురాలిగా పరిచయం అయిన సుబ్బులక్ష్మి 1940లో 'శకుంతలై' అనే చిత్రంలో గాయకురాలిగా తెరపై కనిపించారు. అంతేకాదు 1945లో "మీరా" అనే చిత్రంలో మీరాబాయిగా నటించి జాతీయ గుర్తింపు పొందారు. ఇందులో ఆమె నటనకు ప్రపంచస్థాయి ప్రశంసలు అందాయి. తన ఎదుగుదలకు అంతా తన భర్త సదాశివమే కారణమని ప్రతి మాటకు ముందు చెప్పేవారు సుబ్బులక్ష్మి.
 
ఎక్కని స్టేజిలేదు.. పాడని కృతిలేదు.. పొందని పురస్కారం లేదు.. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఆమె స్వరానికి నీరాజనాలు పట్టాయి. అలాగే ప్రపంచ కర్ణాటక సంగీతంలో మ్యూజిక్ అకాడెమీచే సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగా చరిత్రపుటలకెక్కారు. ఫిలిప్పైన్ ప్రభుత్వం రామన్ మెగసెసె అవార్డు కూడా అందించింది. 
 
అలాగే ఎస్వీ విశ్వవిద్యాలయంతోపాటు పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ప్రపంచ స్థాయిలో ఒక శకాన్ని రూపొందించి ఆబాలగోపాలాన్ని మెప్పించిన ఆ స్వరం 2004 డిసెంబర్ 11న చెన్నైలో మూగబోయింది. అయినా ఇప్పటికీ ప్రతి ఇంటా తెల్లవారు జామునుంచే "కౌశల్యా సుప్రజా రామా" అంటూ ఎంఎస్ స్వరం సంగీత జల్లులు కురిపిస్తూనే ఉంటుంది. ఇదే సంగీత కళానిధి సుబ్బులక్ష్మికి అందిస్తున్న జయంతి నివాళి.