శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:57 IST)

ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరంజీవి... ఎందుకంటే??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరారు. నిజానికి జగన్ సీఎం అయిన తర్వాత ఆయనతో ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరూ సమావేశం కాలేదు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు లాంటి వాళ్ళు కలవాలని అనుకున్న కానీ జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న‌ది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇదే అంశంపై వైకాపాలోని సినీ నటీనటుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ పక్కనపెడితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి జగన్‌ని కలవటానికి అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరు మంచి జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన 'సైరా' చిత్రం సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. కలెక్షన్స్ విషయంలో కూడా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. 
 
ఇక ప్రస్తుతం 'సైరా'ను మరింత ప్రమోట్ చేయడంలో చిరు చాలా బిజీగా ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్  'సైరా' సినిమాని సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా చూపిస్తూ, వారి అభినందనలు అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి చూపించారు. 
 
అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్‌ను కూడా చిరంజీవి కోరినట్టు సమాచారం. అయితే, జగన్‌ను చిరంజీవి కలవడం వెనుక ఆసక్తికరమైన రీజన్లున్నాయని తెలుస్తోంది. సైరా సినిమా సక్సెస్ గురించి ముఖ్యమంత్రికి వివరించాలని చిరంజీవి భావిస్తున్నారట. 
 
అలాగే సీఎంగా ఎన్నికైనందుకు కూడా జగన్‌కు ధన్యవాదాలు చెప్పనున్నారట. అలాగే, 'సైరా' చిత్రం విడుదల సమయంలో ప్రత్యేక ఆటలు వేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెల్సిందే. ఈ కారణాల దృష్ట్యా జగన్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పాలని భావిస్తున్నారట.