శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (15:01 IST)

వైకాపాలో బంధుప్రీతితో అసంతృప్తి? కమలం కండువా కప్పుకోనున్న 'కలెక్షన్ కింగ్'

తెలుగు చిత్ర పరిశ్రమలో కలెక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందిన డైనమిక్ హీరో డాక్టర్ మోహన్‌బాబు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈయన ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దుమ్మెత్తిపోశారు. 
 
అదేసమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తనకు ఏదో ఒక పదవి వస్తుందన్న గట్టి నమ్మకంతో మోహన్ బాబు ఉన్నారు. కానీ, జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఎనిమిది నెలలు కావొస్తుంది. కానీ, మోహన్ బాబును ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జగన్‌పై మోహన్ బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 
 
ఈనేపథ్యంలో మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మి, కోడలు విరోనికలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడిని సోమవారం కలిసారు. ఈ  సందర్భంగా ప్రధాని మోడీతో మోహన్ బాబు 35 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపారు. అపుడు బీజేపీలో చేరాల్సిందిగా మోహన్ బాబును ప్రధాని మోడీ ఆహ్వానించగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అదేసమయంలో బీజేపీలో నంబర్ టూగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా మోహన్ బాబు భేటీకానున్నారు. 
 
ఈపరిస్థితుల్లో వైకాపాలో కొనసాగినా తనకు ఒరిగేది ఏమీ లేదని మోహన్ బాబు బలంగా భావిస్తున్నారు. పైగా, వైకాపాలో బంధుప్రీతి ఎక్కువైందన్న భావన నెలకొంది. అందుకే ఆయన కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బంధుప్రీతితో వైసీపీలో ఉంటే ఒరిగేదేమీ లేదన్న ఆలోచనలో ఉన్న మోహన్‌బాబు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపోమాపో ఆయన కమలం కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదేగానీ జరిగితే.. వైసీపీకి మోహన్‌ బాబు రూపంలో షాక్ తగలడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.